కోదండరామ్ తెలంగాణా ద్రోహి
ఇంకా ముదరక ముందే కోదండరామ్ ని తుంచేసే యత్నం- తెలంగాణా ద్రోహిగా ప్రకటించిన టిఆర్ ఎస్
తెలంగాణా రాష్ట్ర సమితి పొలిటికల్ జెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మీద దాడి ఉధృతం చేసింది. ఈ పార్టీ ఈ రోజు ఆయనను తెలంగాణా ద్రోహి గా వర్ణించింది. ఈ దాడికి అధికార పార్టీ పెద్ద పల్లి లోక్ సభ సభ్యుడు బాల్కసుమాన్ నియోగించింది.
ఇటీవల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కోదండరామ్ కు వైరం తీవ్రమయిన సంగతి తెలిసిందే. రైతులను విస్మరిస్తున్నారని, విద్యార్థులకు న్యాయం చేయడం లేదని, హోమ్ గార్డుల విషయంలో అన్యాయంగా ఉన్నారని,చెబుతూ చివరకు ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్నతాజా నిర్ణయం- కొత్త జిల్లాల ఏర్పాటును కూడా ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వం మీద పార్టీయేతర పోరాటం కోసం ఆయన కృషి మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద పల్లి లోక్ సభ సభ్యుడు బాల్క సుమన్ కోదండ రామ్ ని తెలంగాణా ద్రోహి అని నిందించారు.
కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అని , ఆయన మేధావి ముసుగు తీసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ సంతోషిస్తామని టిఆర్ ఎస్ పెద్ద పల్లి లోక్ సభ సభ్యుడు బాల్క సుమ న్ వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్ ఏజంటని పదే పదే రుజువు అవుతూ ఉందని చెబుతూ 2016 జూలై 16,27 తేది ల్లో కోదండరాం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని రహస్యంగా కలిశారని ఆయన చెప్పారు.
సుమన్ ఈరోజు టిఆర్ ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
“ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి, సుషీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన అమరేందర్ రెడ్డి లతో పాటు కోదండరాం సోనియా ను కలిశారు. ఆయన కాంగ్రెస్ ఏజెంట్ అని మొదట్నుంచీ మేం చెబుతూ వస్తున్నాం.అదే రుజువు అయింది. కోదండరాం సోనియా ను కలిసిన తర్వాతనే మల్లన్న సాగర్ ఆందోళన ల్లో పాల్గొన్నారు. ప్రతి వేదిక మీద ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు..అయన తెలంగాణ ద్రోహి.కాంగ్రెస్ పార్టీ శిఖండి రాజకీయాలు మాను కుంటే మంచిది...దమ్ముంటే నేరుగా మమ్మల్ని ఏదుర్కోండి, “ సుమన్ కోదండ రామ్ గురించి తీవ్ర పదజాలం ప్రయోగించారు.
"కోదండరాం జేఏసీ ,మేధావి ముసుగు లో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పని చేసే బదులు కోదండరాం ఆ పార్టీ కండువా కప్పుకుంటే మంచిది...కోదండరాం ఢిల్లీ లొనే కాదు హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్,కోమటి రెడ్డి, జైపాల్ రెడ్డి లను కూడా తరచూ లుస్తున్నారు...తనకు పదవులు,అధికారం మీద వ్యామోహం లేదంటున్న కోదండరాం కాంగ్రెస్ కపట నాటకం లో సూత్రధారి గా మారారు" అనిన సుమన్ వ్యాఖ్యానించారు.
తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కోదండరామ్ కు,టిఆర్ ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు ఉద్యమం చివరిరోజుల్లో విబేధాలు వచ్చాయి. చివరకు అవి ఒకరినొకరు పల్కరించకొనక పోవడమే కాదు, కలుసుకోవడం కూడా మానేేసే దాకా వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణా ప్రభుత్వం విధానాలకు అభ్యంతరం చెబుతూ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తున్నదని, ఇది తెలంగాణా ఉద్యమ ధ్యేయం కాదని అన్నారు.
ఈ రోజు సుమన్ వ్యాఖ్యలతో కోదండరామ్ తో టిఆర్ ఎస్ ప్రత్యక్ష యుధ్దానికి తలపడుతూ ఉందని అర్థమవుతుంది.