Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్ఎంసీ మేయర్ పీఠం తెరాసాకే !

జీహెచ్ఎంసీ మేయర్ పీఠం అధికార టీఆర్ఎస్ కే దక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి పరిస్థితులు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. సాధారణ మెజార్టీతో తమ పార్టీ కార్పొరేటర్ ను మేయర్ ను చేయడానికి ఆ పార్టీ అగ్రనేతలు రంగం సిద్ధం చేశారు. 

TRS bag the coveted GHMC Mayor seat? - bsb
Author
Hyderabad, First Published Jan 23, 2021, 1:02 PM IST

జీహెచ్ఎంసీ మేయర్ పీఠం అధికార టీఆర్ఎస్ కే దక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి పరిస్థితులు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. సాధారణ మెజార్టీతో తమ పార్టీ కార్పొరేటర్ ను మేయర్ ను చేయడానికి ఆ పార్టీ అగ్రనేతలు రంగం సిద్ధం చేశారు. 

ఫిబ్రవరి 11న, ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మేయర్, ఉపమేయర్ ఎన్నికను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1న బల్దియా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఏ పార్టీకీ మేయర్ ను ఎన్నుకునే స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. 

ప్రస్తుత పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10తో పూర్తి కానుంది. ఆ మర్నాడే కొత్త పాలకవర్గ ఏర్పాటుకు ఎన్నిక సంఘం ముహూర్తం నిర్ణయించింది. పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో కో-ఆప్షన్ సభ్యుల ఆధారంగా మేయర్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంటుందని అంతా భావించారు. 

అయితే సాధారణ మెజార్టీతో దక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. వచ్చే నెల 11న తమ కార్పొరేటరే మేయర్ పీఠంపై కూర్చుంటారని నగరానికి చెందిన అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఆ రోజు సగం మంది సభ్యులు హాజరైనా కోరం సరిపోతుంది. ఎన్నికైన కార్పొరేటర్లందరూ ప్రమాణం చేయాల్సి ఉన్నందున అన్ని పార్టీల కార్పొరేటర్లు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బల్దియా ఎన్నికల్లో తెరాస 56 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎంఐఎం, భాజపా చేతులు కలిపి తన కార్పొరేటర్ అభ్యర్థిని నిలిపితే తెరాస అభ్యర్థి గెలవడం కష్టమవుతుంది. ఈ కలయిక సాధ్యపడే అవకాశం లేదు. ఒక వేళ రెండు పార్టీలు వేర్వేరుగా అభ్యర్థిని నిలిపినా సాధారణ మెజార్టీతో తెరాస అభ్యర్థి సులభంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మెజార్టీ లేకపోవడంతో బీజేపీ మేయర్ బరిలో నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎంఎంఐ బరిలోకి దింపుతుందా.. లేక తమ కార్పొరేటర్లను ఓటు హక్కు వినియోగించుకోవద్దని చెబుతుందా? లేక ప్రమాణం స్వీకారం పూర్తయిన తరువాత మేయర్ ఎన్నిక సమయంలో సభలో నుంచి వెళ్లిపొమ్మంటుందా అన్న విషయం తేలాల్సి ఉంది. 

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే మేయర్ అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ కుమార్తె విజయలక్ష్మికి అవకాశం ఇవ్వాలని ఎంపీ కె. కేశవరావు కోరుతుంటే, తన భార్య శ్రీదేవికి ఇవ్వాలని మేయర్ రామ్మోహన్ కోరినట్లు తెలుస్తోంది. మరి కొందరూ మేయర్ పీఠానికి పట్టుబడుతున్నట్లు సమాచారం. 

ఇప్పటికే ఆరేడు పేర్లు చర్చలో ఉన్నాయి. ఈసారి ఉప మేయర్లుగా ఇద్దరికి అవకాశం కల్పిస్తారన్న విషయమై చర్చ నడుస్తోంది. ఇందుకు ఆర్డినెన్సు విడుదల చేస్తారనీ అంటున్నారు. అయితే ఎన్నికపై పార్టీ అధిష్టానం ఇంకా చర్చించలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios