వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తక్షణం క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై హిజ్రాలు భగ్గుమంటున్నారు. తక్షణం షర్మిల క్షమాపణలు చెప్పాలని హిజ్రాలు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ ప్రస్తావన తెచ్చిన షర్మిలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా అమీర్‌పేటలో హిజ్రాలు చేసిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తమకు షర్మిల తక్షణం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

కాగా.. ఇటీవల వైఎస్ షర్మిల పాదయాత్రను మహబూబాబాద్ లో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా షర్మిల వ్యవహరిస్తున్నారంటూ పాదయాత్రకు పోలీసులు అనుమతి తిరస్కరించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ లో పాదయాత్ర క్యాంప్ లో షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో తన పాదయాత్రను అడ్డుకోవడంపై షర్మిల స్పందిస్తూ బిఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ALso REad: మీరు మరదలు, శిఖండి, కొజ్జా అనొచ్చా... నేను జవాభిస్తే తప్పొచ్చిందా?: వైఎస్ షర్మిల

మహిళ అని కూడా చూడకుండా మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకేమో వ్రతాలంటాడు, ఇంకోడేమో మరదలు అంటాడు, ఇంకొకామె శిఖండి అంటుంది, మరొకరు కొజ్జా అంటాడని...అడుగు బయటపెడితే నల్లిని నలిపేసినట్లు నలిపేస్తామని ఒకడు, కార్యకర్తలకు ఒక్క సైగచేస్తే దాడి చేస్తారని ఇంకొకరు బెదిరిస్తారని అన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా చెల్లుతదా.. మేం బధులిస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానం మహిళా లోకానికి జరిగినట్లని... కాబట్టి మహిళలంతా ఒక్కటై కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పాలని షర్మిల కోరారు.

ఇదే వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్‌ నేతలపై రాష్ట్ర మహిళ కమిషన్‌కు షర్మిల మంగళవారం ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌లో తన పాదయాత్రను బీఆర్ఎస్ నేతలు అడుకున్నారని షర్మిల చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తనపై అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను కూడా ఫిర్యాదులో చేర్చారు.