కోర్టులు నిషేధిత సంస్థలా: టీఆర్ఎస్పై ఉత్తమ్ ధ్వజం
స్వాతంత్ర్యం వచ్చాక ఈ రకంగా అవినీతికి పాల్పడిన ప్రభుత్వాన్ని తాను ఏనాడూ చూడలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆదాయంలో అంబానీ, ఆదానీలతో కేసీఆర్ కుటుంబసభ్యులు పోటీలు పడుతున్నారని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: స్వాతంత్ర్యం వచ్చాక ఈ రకంగా అవినీతికి పాల్పడిన ప్రభుత్వాన్ని తాను ఏనాడూ చూడలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆదాయంలో అంబానీ, ఆదానీలతో కేసీఆర్ కుటుంబసభ్యులు పోటీలు పడుతున్నారని ఆయన విమర్శించారు.
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తాము అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పలేదన్నారు. హరీష్ రావు అన్ని అబద్దాలే మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో తాము అడిగిన ప్రశ్నల గురించి ఇకనైనా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టులకు వెళ్లిందన్నారు. కోర్టులు నిషేధిత సంస్థలా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో అన్యాయానికి పాల్పడుతోందన్నారు.
అందుకే తాము కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదన్నారు. టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలను బానిసలుగా చూస్తారని ఆయన జోస్యం చెప్పారు.