టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో కామారెడ్డికి బయల్దేరారు. బిక్కనూర్, రాజంపేట, చిన్నమల్లారెడ్డి సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నుంచి నాలుగు చోట్ల జరిగే సభల్లో పాల్గొనాల్సి వుండటంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి హెలికాఫ్టర్ కేటాయించింది. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా శనివారం కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి మూడు సభల్లో పాల్గొనాల్సి వుంది. ఇందుకోసం హెలికాఫ్టర్ వినియోగించబోతే.. దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో కామారెడ్డికి బయల్దేరారు. బిక్కనూర్, రాజంపేట, చిన్నమల్లారెడ్డి సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read: k chandrashekar rao : కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం.. రోజుల వ్యవధిలో మూడోసారి

కాగా.. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గోన్నారు కేసీఆర్. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు హెలికాఫ్టర్‌లో బయల్దేరగా చాపర్ మొరాయించింది. గడిచిన కొద్దిరోజుల్లో కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారి. ఇప్పటికే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లలో ఇలాంటి సమస్యే ఆయనకు ఎదురైన సంగతి తెలిసిందే. 

అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ అంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసే ముందు అభ్యర్ధులు వారి పార్టీల చరిత్ర చూడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.