Asianet News TeluguAsianet News Telugu

పేపర్ లీక్.. టీఎస్‌పీఎస్‌సీపై చర్యలేవి, కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి: కేసీఆర్‌కు రేవంత్ లేఖ

పేపర్ లీక్ కేసులో టీఎస్‌పీఎస్‌సీ బోర్డుపై చర్యలు తీసుకుని, ఐటీ మంత్రిని బర్తరఫ్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. 

tpcc chief revanth reddy letter to telangana cm kcr over tspsc paper leak case
Author
First Published Mar 17, 2023, 7:44 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని.. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని కానీ వాటిని భర్తీ చేయడం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.3106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి..మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటిఫికేషన్లు, షెడ్యూల్స్‌ని ప్రకటించిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్ధత కారణంగా పరీక్షలు రద్దు చేసే పరిస్ధితి ఏర్పడిందని.. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ కేసులో నిందితులుగా వున్న వారికి బీజేపీతో పాటు మీతోనూ రాజకీయ సంబంధాలు వున్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పేపర్ లీకేజ్ విషయంలో టెక్నికల్ అంశాలు వున్నందున.. ఈ శాఖకు మంత్రిగా వున్న కేటీఆర్ కూడా బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. ఇంత జరిగినా నేటి వరకు కమీషన్ ఛైర్మన్, సభ్యులపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కనీసం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సమీక్ష కూడా చేయలేదని.. టీఎస్‌పీఎస్‌సీ బోర్డుపై చర్యలు తీసుకుని, ఐటీ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Also Read: పేపర్ లీక్ కేసు.. రాజశేఖరే ప్రధాన సూత్రధారి, ఉద్దేశ్యపూర్వకంగానే టీఎస్‌పీఎస్సీకి : సిట్ నివేదికలో కీలకాంశాలు

అంతకుముందు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థపై ఆయనకు కనీసం అవగాహన లేదన్నారు. బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో తనకు అర్ధం కావడం లేదంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బోడి గుండుకు, మోకాలికి ముడిపెట్టినట్లు ధరణి పోర్టల్‌ , టీఎస్‌పీఎస్సీ అంశంతో తనపై ఆరోపణలు చేయడాన్ని సహించేది లేదన్నారు. బండి సంజయ్ చేస్తున్న కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నోసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు కేటీఆర్ తెలిపారు. మరి వీటిపై సంజయ్ ఏమంటారంటూ మంత్రి నిలదీశారు. ఈ లీకేజ్‌లకు సంబంధించి మోడీని బాధ్యుణ్ణి చేసి రాజీనామా డిమాండ్ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మధ్యప్రదేశ్ వ్యాపం కేసు కుంభకోణంలోనూ బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసునని కేటీఆర్ దుయ్యబట్టారు. పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం సిట్‌ను నియమించిందని.. బాధ్యులైన వారిని తక్షణం అరెస్ట్ చేసిందని మంత్రి గుర్తుచేశారు. అర్హులైన అభ్యర్ధులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios