రూ.40కే పెట్రోల్ రావాలి... రూ.30 మోడీ, మరో 30 రూపాయలు కేసీఆర్ దోచుకుంటున్నారు: రేవంత్
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై టీ. కాంగ్రెస్ రేపు ఆందోళనకు సిద్ధమైంది. దీనిలో భాగంగా శుక్రవారం ఇందిరా పార్క్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్కు వినతి పత్రం అందజేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
రేపు ఇందిరా పార్క్ నుంచి ఛల్ రాజభవన్కు టీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. రేపు గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. దేశంలో అందరూ మోడీ బారినపడ్డ వారేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. రూ.40కి రావాల్సిన పెట్రోల్ను రూ.104కి అమ్ముతున్నారని రేవంత్ ఆరోపించారు. రూ.30 కేసీఆర్, రూ.30 మోడీ దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే, జనం రోడ్డు ఎక్కాల్సిందేనని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పేదల కోసం పార్లమెంట్లో కొట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు.
Also Read:రేవంత్ దూకుడు: కొండా సురేఖ సహా హుజారాబాదు ఎన్నికలకు మండల ఇంచార్జీలు
సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని రేవంత్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఖాళీలెన్నో తేల్చాలని తాజాగా చేస్తోన్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్లా ఉందని రేవంత్ ఆరోపించారు. 2020 డిసెంబర్లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైందన్నారు. ఆ నివేదిక ఉండగా కొత్తగా లెక్కలు తేల్చేదేంటి అని ప్రశ్నించారు. వాస్తవంగా 1.91 లక్షల ఖాళీలు ఉండగా... 56 వేలు దాటడం లేదన్నట్టు దొంగ లెక్కలేంటి అని టీపీసీసీ చీఫ్ నిలదీశారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని... అన్నింటి పైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.