Asianet News TeluguAsianet News Telugu

Today Top News: రైతుబంధుకు రేవంత్ గ్రీన్‌సిగ్నల్‌.. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి ..

Today Top News: తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.

Today Top News Telangana CM Revanth Reddy orders immediate payment of Rythu Bandhu funds KRJ
Author
First Published Dec 12, 2023, 6:36 AM IST


నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల 

తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం.  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నేటినుండే ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా  పంట పెట్టుబడి సహాయం అందించాలని ఆదేశించారు.


ఇకపై ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి 

ప్రస్తుతం ‘జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్’లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ‘ప్రజావాణి’గా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పైనా రివ్యూ 

తెలంగాణ రాష్ట్రంలో  మాదకద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై సోమవారం  డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణా రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటలీజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 త్వరలో కాళేశ్వరంపై దర్యాప్తునకు ఆదేశిస్తాం : మంత్రి ఉత్తమ్

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే దర్యాప్తునకు ఆదేశిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్  రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు నెల క్రితం మేడిగడ్డ బ్యారేజీలో స్తంభాలు కూలిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఐ అండ్‌ క్యాడ్‌) శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

పెండింగ్, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్ సీ మురళీధర్ రావు వివరించారు. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్  మీడియాతో మాట్లాడుతూ..  త్వరలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, కేబినెట్‌ సమావేశంలో లోపాలను కూలంకషంగా చర్చించి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.  కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద 70 వేల ఎకరాలకు పైగా స్థిరీకరణ జరిగిందని అధికారులు ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పడంతో మంత్రి ఆశ్చర్యపోయారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని, నిర్మాణం, డిజైన్‌తో సంబంధం ఉన్న వారినే బాధ్యులని అన్నారు. 


తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ .. 11 నియోజకవర్గాల్లో ఇన్ చార్జీల మార్పు..
 

తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పడింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సర్కార్ తన పార్టీలో కీలక మార్పులు చేశారు. 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  సోమవారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు.   

అభ్యర్థుల జాబితా: 

  • మంగళగిరి – గంజి చిరంజీవి
  • చిలకలూరిపేట – మల్లెల రాజేశ్ నాయుడు
  • గుంటూరు వెస్ట్ – విడదల రజిని
  • కొండేపి (ఎస్సీ) – ఆదిమూలపు సురేశ్
  • పత్తిపాడు – బాలసాని కిరణ్ కుమార్
  • అద్దంకి – పాణెం హనిమి రెడ్డి
  • తాడికొండ (ఎస్సీ) – మేకతోటి సుచరిత
  • వేమూరు (ఎస్సీ) – వరికూటి అశోక్ బాబు
  • సంతనూతలపాడు (ఎస్సీ) – మేరుగు నాగార్జున
  • రేపల్లె – ఈపూరి గణేశ్
  • గాజువాక – వరికూటి రామచంద్రరావు


ఒకే వేదిక పైకి చంద్రబాబు- పవన్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి.ఇప్పటికే టీడీపీ-జనసేన (TDP-Janasena)పొత్తు కుదిరిపోయింది.ఈ తరుణంలో ఇరు పార్టీలు జనంలోకి వెళ్లాలని, వారితో మరింత మమేకం కావాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర  విజయోత్సవ సభను నిర్వహించేందుకు ప్లాన్లు కూడా వేస్తున్నాయి.

ఈ మేరకు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు పాల్గొననున్నారు. ఇరు పార్టీల పొత్తు ప్రకటన తర్వాత నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కావడం విశేషం.

మోదీపై అభ్యంతరకర కథనాలు.. సంజయ్ రౌత్‌పై కేసు..


ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర కథనం రాశారంటూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌పై కేసు నమోదైంది. పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర కథనాలు రాశారని రౌత్‌పై ఆరోపణలు వచ్చాయి. 'సామ్నా' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రౌత్‌పై యవత్మాల్ బీజేపీ కన్వీనర్ నితిన్ భుతాడా సోమవారం ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 11న ప్రధాని మోదీపై రౌత్ అభ్యంతరకర కథనాన్ని రాశారని భూతాడా పేర్కొన్నారు. సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ఇతర నేరాలకు పాల్పడినందుకు రౌత్‌పై IPC సెక్షన్లు 153 (A), 505 (2) , 124 (A) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

మోదీపై అభ్యంతరకర కథనాలు.. సంజయ్ రౌత్‌పై కేసు..

ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర కథనం రాశారంటూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌పై కేసు నమోదైంది. పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర కథనాలు రాశారని రౌత్‌పై ఆరోపణలు వచ్చాయి. 'సామ్నా' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రౌత్‌పై యవత్మాల్ బీజేపీ కన్వీనర్ నితిన్ భుతాడా సోమవారం ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 11న ప్రధాని మోదీపై రౌత్ అభ్యంతరకర కథనాన్ని రాశారని భూతాడా పేర్కొన్నారు. సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ఇతర నేరాలకు పాల్పడినందుకు రౌత్‌పై IPC సెక్షన్లు 153 (A), 505 (2) , 124 (A) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios