తెలంగాణ రాష్ట్రం మెల్లిమెల్లిగా కరోనా కోరల్లోంచి బయటపడుతున్నట్లు కనిపిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో పాటు రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20,475 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటన తెలియజేస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24గంటల్లో 41,475 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 1,579 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 39,40,304కు చేరితే కేసుల సంఖ్య 2,26,124కు చేరింది. ఇక ఇప్పటికే కరోనా బారిన పడిన వారిలో నిన్న ఒక్కరోజే 1,811మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 2,04,388కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 90.38శాతంగా వుంటే దేశంలో 88.8శాతంగా వుంది. 

read more కరోనా నుండి మెల్లిగా బయటపడుతున్న తెలంగాణ... 90శాతం రికవరీ రేటుతో

ఇక కరోనా కారణంగా ఆరోగ్యం క్షీణించి గత 24గంటల్లో కేవలం ఐదుగురు మాత్రమే మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు సమోదయిన మరణాల సంఖ్య 1287కు చేరింది. మరణాలు రేటు రాష్ట్రంలో 0.56శాతంగా వుంటే దేశంలో మాత్రం 1.5శాతంగా వుంది.

జిల్లాల వారిగా బయటపడ్డ కేసులను పరిశీలిస్తే అత్యధికంగా జీహెచ్ఎంసీ(హైదరాబాద్)లో 256కేసులు బయటపడ్డాయి. రంగారెడ్డి 102, మేడ్చల్ 135, ఖమ్మం 106, భద్రాద్రి కొత్తగూడెం 87, కరీంనగర్ 64, నల్గొండ 90, సిద్దిపేట 53, వరంగల్ అర్బన్ 59 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వుంది.