- Home
- Telangana
- Telugu States Rains Alert : ఇక వానలే వానలు .. ఈ తేదీల్లో తెలుగు ప్రజలు జాగ్రత్త, కుండపోత వర్షాలుంటాయని వార్నింగ్
Telugu States Rains Alert : ఇక వానలే వానలు .. ఈ తేదీల్లో తెలుగు ప్రజలు జాగ్రత్త, కుండపోత వర్షాలుంటాయని వార్నింగ్
తెలుగు రాాష్ట్రాల్లో ఇక వానలే వానలు కురుస్తాయట. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలవగా పలు ప్రాంతాల్లో ఇవి కుండపోతగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏయే తేదీల్లో, ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయో వాతావరణ శాఖ ప్రకటించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు షురూ...
Telangana, Andhra Pradesh Weather : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి... దీంతో తెలుగు రాష్ట్రాల్లో గత నెల మే చివర్లోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పుడూ వర్షాకాలం జూన్ లో ప్రారంభం అవుతుంది... కానీ ఈసారి తొలకరి జల్లులు కురవాల్సిన సమయంలో మేఘాలు ముఖం చాటేసాయి. వర్షాలతో వాతావరణం చల్లగా ఉండాల్సిన సమయంలో భానుడి భగభగలు, ఉక్కపోతతో తెలుగు ప్రజలు సతమతం అయ్యారు. తాజాగా వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో కొద్దిరోజులు వర్షాలు కురవలేవని... ఇప్పుడు అవి వేగం పుంజుకోవడంతో తిరిగి వానలు ప్రారంభమైనట్లు తెలిపారు. నిన్న(సోమవారం) ఇరురాష్ట్రాల్లోనూ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇకపై ఇలాగే వర్షాలు కురుస్తూ వెదర్ కూల్ కూల్ గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు తెలంగాణలో వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఈ రెండ్రోజులు (జూన్ 10,11) మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతపవనాల కదలికలకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో తిరిగి వర్షాలు ప్రారంభమయ్యాయి.
నేడు(మంగళవారం) తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నగరంలో చాలాప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయని... కొన్నిచోట్ల వర్షం కురవకున్న ఆకాశం మేఘాలతో కప్పివుండి వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు.
ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి. నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయట. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవగా ఇవి మరింత జోరందుకోనున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
జూన్ 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక జూన్ 14న మరో అల్పపీడనం ఏర్పడుతుందట. వీటికి రుతుపవనాలు తోడవనున్నాయి. దీంతో ఏపీలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది. కర్ణాటకలో జూన్ 12 నుండి 15 వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని... దీంతో వరదలు సంభవిస్తాయని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చెరి, గోవాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందట.
ఇక జూన్ 10 నుండి 13 మధ్య రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 12న తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయట. కోస్తాంధ్ర, యానాంలలో ఈదురుగాలులు వీస్తాయట... 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ఈ రాష్ట్రాల ప్రజలు జాగ్రత్త
మొత్తంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దీంతో ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
ఈ వర్ష సూచనలు రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపాయి. ఇప్పటికే తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు మధ్యలో వర్షాలు లేకపోవడంతో కంగారుపడ్డారు. తిరిగి వర్షాలు జోరందుకోవడంతో రైతలు తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.