దేవరకద్ర గుట్టపై మృతదేహాలు... ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
వారం రోజుల నుంచి బాలకిష్టమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. మరో వైపు లాక్ డౌన్ విధించడంతో వ్యాపారంలో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. లాక్ డౌన్ కారణంగా వ్యాపారం మూతపడి.. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో.. ఓ కుటుంబం తట్టుకోలేకపోయింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తామని బంధువులకు చెప్పి వెళ్లి... ఆ ఆలయ గట్టుమీదే బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో తల్లి, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేవరకద్రకు చెందిన బాలకృష్ణమ్మ(55) కుమారుడు రాజు, కూతరు సంతోషతో కలిసి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజుల నుంచి బాలకిష్టమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. మరో వైపు లాక్ డౌన్ విధించడంతో వ్యాపారంలో తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా.. దాయాదులతో ఆస్తి తగాదాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
మన్యంకొండ దేవస్థానానికి వెళ్లొస్తామని బంధువులకు చెప్పి ఈనెల 24న ఇంటి నుంచి బయలుదేరి తిరిగిరాలేదు. బుధవారం సాయంత్రం చౌదర్పల్లి గుట్టపై మొక్కలకు నీరు పోయడానికి వెళ్లిన కూలీలకు కుళ్లిన మూడు శవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి దర్యాప్తు చేయగా.. ఈ విషయం బయటపడింది. రెండురోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.