ఖమ్మంలో విషాదం... సాగర్ కాలువలో కొట్టుకుపోయిన ముగ్గురు కేరళవాసులు
తెలంగాణలో ఓ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో పనిచేసే కొందరు కేరళ వాసులు సరదాగా గడిపేందుకు ఆదివారం సాగర్ కెనాల్ వద్దకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయి ముగ్గురు మృత్యువాతపడ్డారు.
ఖమ్మం: ఆదివారం సెలవురోజు కావడంతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. నాగార్జునసాగర్ కాలువ (nagarjuna sagar canal)లో పడిపోయిన ఓ బాలుడిని కాపాడే క్రమంలో నీటిలోకి దూకిన ముగ్గురు గల్లంతయ్యారు. బాలుడు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు వచ్చాడు.ఈ ఘటన ఖమ్మం జిల్లా (khammam district)లో చోటుచేసుకుంది.
తెలంగాణలో పలు పట్టణాల్లో అభయ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ (abhay ayurvedic hospital) కొనసాగుతోంది. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో కూడా ఈ ఆయుర్వేద హాస్పిటల్ శాఖలున్నాయి. వీటిలో కేరళ (kerala) రాష్ట్రానికి చెందిన పలువరు సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఇలా ఒకే హాస్పిటల్ శాఖలో పనిచేస్తున్న కేరళ వాసులు స్నేహంగా వుండేవారు. వారాంతాల్లో కుటుంబాలతో కలిసి సరదాగా గడుపుతుండేవారు.
ఈ క్రమంలోనే నిన్న సెలవురోజు కావడంతో సూర్యాపేట (suryapet) నుండి అభయ్, కోదాడ (kodada) నుండి షాజీ, ప్రదీప్ సరదాగా గడిపేందుకు ఖమ్మం వెళ్లారు. అక్కడ సోను తన పదకొండేళ్ల కుమారుడు షారోన్ తో కలిసి వీరిని రిసీవ్ చేసుకున్నాడు. వీరికి షైన్ షిబు, ప్రదీప్, వివేక్ తోడయ్యారు. అంతా ఖమ్మంలో కలుసుకుని కారులో దానవాయిగూడెం సమీపంలోని నాగార్జున కాలువ వద్దకు వెళ్లారు.
Read More Adilabad Farmer Suicide: పోడుభూముల వివాదం...ఐదెకరాల కోసం ఆదివాసీ రైతు ఆత్మహత్య
ప్రదీప్, షాజీ, షిబుకు ఈత రావడంతో కాల్వలోకి దిగారు. మిగతా వివేక్, అభయ్, సోను, ఆయన కుమారుడు షారోన్ గట్టున కూర్చున్నారు. అయితే ప్రమాదవశాత్తు షారోన్ గట్టుపైనుండి జారి కాలువలో పడిపోయాడు. వెంటనే ఈత రాకపోయినా కొడుకును కాపాడుకునేందుకు సోను నీటిలోకి దూకాడు. అతడితోపాటే వివేక్, అభయ్ కూడా కాలువలోకి దూకారు.
అయితే నీటిలో కొట్టుకుపోతున్న షారోన్ ను ప్రదీప్ కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఈత రాకపోవడంతో సోను, వివేక్, అభయ్ నీటిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో వీరిని కాపాడలేకపోయారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఈ ముగ్గురు గల్లంతయ్యారు.
సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో సమాచారం అందుకుని పోలీసులు, గ్రామస్తులు సహాయక చర్యలు ప్రారంభించే సమయానికే చీకటిపడింది. దీంతో గాలింపును నిలిపివేసి సోమవారం ఉదయం తిరిగి ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు.
Read More సత్తుపల్లిలో విషాదం: కొడుకును ఖననం చేసిన స్థలంలోనే తండ్రి సూసైడ్
ఇలా సెలవురోజుల సరదాగా గడిపేందుకు వెళ్ళి ముగ్గురు కేరళవాసులు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతయిన వారి కుటుంబసభ్యులు సాగర్ కాలువవద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నీటి ప్రవాహాల వద్ద జాగ్రత్తగా వుండాలని... ఈత రానివారు దూరంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇటీవల సిరిసిల్ల జిల్లా (rajanna siricilla district)లోనూ ఇలాగే ఈత సరదా ఆరుగురు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. మానేరు వాగులో సరదాగా ఈతకొట్టడానికి దిగిన విద్యార్థులు బాగా లోతులోకి వెళ్ళి మునిగిపోయారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు మానేరు వాగులో ఈతకు దిగగా ఆరుగురు విద్యార్ధులు లోతులోకి వెళ్లి మునిగి మృత్యువాతపడ్డారు. మిగతా ముగ్గురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.