కేవైసీ అప్డేట్, లాటరీ, బిజినెస్.. మూడు అస్త్రాలతో ముగ్గురికి టోకరా, కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్డేట్, లాటరీ పేరుతో అమాయకులను దోచేస్తున్నారు. ఇవాళ ఒకే రోజు ముగ్గురిని మోసం చేశారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి ఐదు లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు. అలాగే లాటరీ వచ్చిందంటూ పాతబస్తీకి చెందిన మహిళ నుంచి మరోక రూ.5 లక్షలు కాజేసినట్లుగా తెలుస్తోంది.
నగరంలోని డీడీ కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం సైబర్ నేరగాడు కాల్ చేశాడు. టెలికామ్ సంస్థ పేరుతో ఫోన్ చేసి సిమ్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు. ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి కొంత మొత్తం ఖర్చవుతుందని నమ్మబలికాడు. ఇక లాటరీ పేరుతో పాతబస్తీకి చెందిన యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు రూ.5 లక్షలకు పైగా కాజేశారు.
పాతబస్తీ బడా బజార్కు చెందిన ముంతాజ్ బేగంకు ఇటీవల ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇటీవల మీరు చేసిన షాపింగ్లో రిజిస్టర్ అయిన మీ ఫోన్ నెంబర్కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందన్నారు. ముందుగా లాటరీ గిఫ్ట్ ట్యాక్స్ 30 శాతం చెల్లించాల్సి వుంటుందని నమ్మబలికారు. తాము ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తామని రూ.5.25 వేలు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. వారి మాటలు నమ్మిన ముంతాజ్ వారు అడిగిన మొత్తాన్ని ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత కాల్ వచ్చిన నెంబర్కు ప్రయత్నించగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన ముంతాజ్.. సిటీ సైబర్ క్రైమ్స్లో బుధవారం ఫిర్యాదు చేసింది.
Also Read:సైబర్ క్రైమ్: అరుదైన ఫారెస్ట్ ఆయిల్.. వ్యాక్సిన్లలో వాడతారు, బిజినెస్ సూపర్ అంటూ రూ.11 కోట్ల టోకరా
ఇక మరో కేసులో ఫారెస్ట్ ఆయిల్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల మేర బాధితులకు టోకరా పెట్టారు కేటుగాళ్లు. ఫేస్బుక్తో గీతా నారాయణ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ట్ చేస్తున్నట్లు నమ్మించారు. వ్యాక్సిన్ తయారయ్యే అగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు .. విడతలవారీగా రూ.11 కోట్లను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత మోసం గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.