పునర్ నిర్మాణపనులు ప్రైవేటుకు అప్పగింత
కాకతీయుల కళావైభవానికి.. అద్భుత శిల్పసౌందర్యానికి సజీవ సాక్ష్యం... హన్మకొండలోని వెయ్యిస్తంభాల గుడి...
త్రికూటేశ్వరాలయంగా చరిత్రకెక్కికన ఈ చారిత్రక కట్టడం పాలకుల నిర్లక్ష్యం వల్ల చదలుపడుతోంది.
వెయ్యిస్తంభాల గుడికు వన్నెతెచ్చే కల్యాణమండపాన్ని పునర్ నిర్మాణం పేరుతో 2005 లో కూల్చివేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి దాని పునర్ నిర్మాణం అర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( ఏ ఎస్ ఐ) ఆధ్వర్యంలో నత్తనడకనసాగుతోంది.
ఇప్పటివరకు అనేకసార్లు గడువులు విధిస్తూ ..వాటిని పొడగిస్తూ పునర్ నిర్మణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దాదాపు 80 శాతం పనులు ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు కల్యాణ మండపం పునర్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న స్థపతి శివకుమార్ దీనిపై మాట్లాడుతూ... అత్యంత కీలకమైన కల్యాణ మండపం నిర్మాణ పనులను చాలా మంది శిల్పులతో కలసి చేపట్టినట్లు చెప్పారు.
చాలా స్తంభాలు శిథిలమయ్యాయని వాటి స్థానంలో కొత్త స్తంభాలును పూర్తి స్థాయిలో నిర్మించామని చెప్పారు. కాగా, నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు కోటి రూపాయిల వరకు ఖర్చు అయిందని తెలిపారు.
తమకు చెల్లించాల్సిన డబ్బులకు సంబంధించి బిల్లులు పెట్టామని ఇప్పటివరకు పైసా కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు తుది దశకు వచ్చాయని ఈ సమయంలో పునర్ నిర్మాణ పనులను ప్రైవేటు వారికి ఎందుకు అప్పగిస్తున్నారో తెలియడం లేదన్నారు.
మరోవైపు 80 శాతం పనులు పూర్తి చేశామని చెబుతున్న ఏఎస్ఐ ఇప్పుడు మిగిలిన పనులను చేపట్టకుండా ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు తెలిపింది.
దాదాపు 60 లక్షల రూపాయిల పనులను చేపట్టేందుకు ఇప్పటికే ఏఎస్ఐ టెండర్లను ఆహ్వానించింది.
అయితే అత్యంత కీలకమైన పనులను ప్రైవేటు పరం చేయడంపై జిల్లాకు చెందిన చరిత్రకారులు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
