టీఎంయూకు థామస్ రెడ్డి గుడ్బై: ఆశ్వత్థామరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
టీఎంయూకు థామస్ రెడ్డి రాజీనామా చేశారు. ఆశ్వత్థామరెడ్డి కూడ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్: టీఎంయూకు థామస్ రెడ్డి రాజీనామా చేశారు. ఆశ్వత్థామరెడ్డి కూడ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి ముఖం చాటేశారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు.
ఆర్టీసీ కార్మికులు 33 మంది కరోనాతో చనిపోతే పట్టించుకోలేదని ఆయన చెప్పారు. బీజేపీలో ఎమ్మెల్సీ సీటు వచ్చేవరకు ఆశ్వత్థామ రెడ్డి యూనియన్ లో ఉంటారని చెప్పారు.
స్వలాభం కోసం తప్ప ఆయనతో కార్మికులకు ఉపయోగం లేదని థామస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఎంయూ వ్యవస్థాపకుడిగా తాను కూడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ట్రేడ్ యూనియన్ లో రాజకీయ పోకడలు తగవని ఆయన హితవు పలికారు.
also read:టీఎంయూ కార్యవర్గసమావేశానికి థామస్ వర్గం దూరం: ఏం జరుగుతోంది?
ఆదివారం నాడు నిర్వహించిన టీఎంయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి థామస్ రెడ్డి వర్గీయులు హాజరుకాలేదు. ఇవాళ థామస్ రెడ్డి వర్గీయులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఎంయూకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల్లో మరో కొత్త సంఘం ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో థామస్ రెడ్డి వర్గీయులు టీఎంయూకు గుడ్ బై చెప్పడం ప్రాధాన్యత నెలకొంది. టీఆర్ఎస్ కు అనుబంధంగా మరో కార్మిక సంఘం ఏర్పడే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.