Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ కు రేవంత్ మరో బహిరంగ లేఖ

  • ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
  • అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారు.
  • మీ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు
  • తక్షణమే నిర్ణయం తీసుకోండి
this is revanth s another open letter to kcr

రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారికి..

ప్రాయ‌శ్చిత్తానికి మించిన శిక్ష‌లేదని మ‌న వేదాలు,ధ‌ర్మ‌శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే యావ‌జ్జీవ‌కారాగార శిక్ష ప‌డిన ఖైదీకైనా ఐదేళ్లు శిక్ష‌ విధిస్తే స‌రిపోతుంద‌ని మ‌హాత్మా గాంధీ కూడా చెప్ప‌డం జ‌రిగింది. వారు మాత్ర‌మే కాదు తెలంగాణా ఉద్య‌మ స‌మ‌యంలోనూ, గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగానూ 5సంవ‌త్స‌రాలు శిక్ష పూర్తి చేసిన వారిని విడుద‌ల చేస్తామ‌ని మీరు కూడా ప‌లు సంద‌ర్భాల‌లో హామీ ఇవ్వ‌డం జ‌రిగింది.రాష్ట్రం ఏర్ప‌డి నాలుగేళ్ల‌వుతున్నా ఖైదీల‌కు ఇచ్చిన హామీని మీరు నిల‌బెట్టుకోక‌పోవ‌డంతో అటు ఖైదీలు, ఇటు వారి రాక‌కోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబీకులు కూడా మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తున్నారు.

ఆవేశంలోనో, ఆగ్ర‌హంతోనో త‌ప్పు చేసి, కొన్ని సంద‌ర్భాల‌లో తాము త‌ప్పు చేయ‌క‌పోయినా త‌ప్పు చేసిన వారికి బంధువులో, స్నేహితులో అయిన పాపానికి నాలుగు గోడ‌ల మ‌ధ్య  న‌లిగిపోయే వారు అనుక్ష‌ణం మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తూనే ఉంటారు.వారిపై ఆధార‌ప‌డిన కుటుంబీకులు అంత‌కు మించిన మాన‌సిక శిక్ష‌ను అనుభ‌విస్తుంటారు. జీవితం విలువ తెలియాలంటే యావ‌జ్జీవ శిక్ష ప‌డిన ఖైదీల‌ను అడిగి తెలుసుకోవాల‌ని కూడా గాంధీ గారు చెప్ప‌డం జ‌రిగింది. అందుకే వారికి మేలు చేసే మాట ఎవ‌రిచ్చినా అది ఎప్పుడు నిజ‌ మౌతుందా అని క‌ళ్ల‌లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటారు. తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే ఐదేళ్ల శిక్షా కాలం పూర్తి చేసిన ఖైదీల‌ను అంద‌రినీ విడుద‌ల చేస్తామ‌ని హామీ ఇచ్చిన మీరు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారి ప్ర‌సాదించిన క్ష‌మాభిక్ష వంద‌లాది మంది ఖైదీల‌ను నిరాశ ప‌రిచింది.

మీరు గ‌తంలో ఇచ్చిన మాట‌కు భిన్నంగా ఐదేళ్లు శిక్ష పూర్తి చేసిన వారిని కాకుండా 12 నుంచి 14 సంవ‌త్స‌రాల వాస్త‌వ శిక్ష‌, క‌నీసం ఆరు సంవ‌త్స‌రాల రిమిష‌న్ శిక్ష‌తో క‌లిపి కనీసం 18 నుంచి 20 సంవ‌త్స‌రాల శిక్షా కాలాన్ని పూర్తి చేసిన వారికి మాత్ర‌మే క్ష‌మాభిక్ష పెట్టి విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఈ కాల‌ప‌రిమితి కార‌ణంగా  వంద‌లాది ఖైదీలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో శిక్ష అనుభ‌విస్తున్న త‌మ వారు విడుద‌ల‌వుతార‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్న వంద‌లాది కుటుంబాల‌కు నిరాశే మిగిలింది. ఆ త‌ర్వాత మ‌రో సంద‌ర్భంలోనైనా మీరు మీ మాట‌ను నిల‌బెట్టుకుంటార‌ని ఖైదీలు, వారి కుటుంబీకులు ఆశ‌గా ఎదురుచూస్తున్న ఫ‌లితం లేకుండా పోతోంది. ఎన్నో గాంధీ జ‌యంతులు, రిప‌బ్లిక్ డేలు వెళ్లిపోతున్నా మీరు మాత్రం ఖైదీల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేదు. ఇది చాలా దారుణం, అమాన‌వీయం కూడా. ఈ నేప‌థ్యంలోనే రాబోయే రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న ఖైదీల‌ను విడుద‌ల చేయ‌డానికి అవ‌స‌ర‌మైన జీవోను విడుద‌ల చేయాల్సిన బాధ్య‌త మీ మీద‌నే ఉన్న‌ది.

అయితే గ‌తంలో పెట్టిన ష‌ర‌తులు కాల‌ప‌రిమితుల‌తో కాకుండా ఉద్య‌మ స‌మ‌యంలో ఖైదీల‌కు మీరు హామీ ఇచ్చిన విధంగా మ‌హిళా ఖైదీల‌లో 5 సంవ‌త్స‌రాల వాస్త‌వ శిక్ష‌ను పూర్తి చేసిన వారిని, అలాగే మ‌గ‌ఖైదీల‌లో 7 సంవ‌త్స‌రాల వాస్త‌వ శిక్ష‌ను, మూడేళ్ల రిమిష‌న్ శిక్ష‌తో క‌లిపి ప‌దేళ్ల శిక్ష‌ను పూర్తి చేసిన వారంద‌రినీ విడుద‌ల చేయ‌డానికి జీవోను జారీ చేయాల్సిందిగా కోరుతున్నాను. గ‌తంలో జీవో ఎం.ఎస్‌.132, తేదీ25.09.1969,  జీవో ఎంఎస్ 1040, తేదీ 04.08.1972,  జీవో ఎంఎస్ 413, తేదీ 03.04.1975,  జీవో ఎంఎస్ నెం.357,తేదీ 20.10.1980, జీవో ఎంఎస్ నె.580, తేదీ 20.10.1984 ల ద్వారా 1969, 1972, 1975, 1980, 1983, 1984 సంవ‌త్స‌రాల‌లో అప్ప‌టి ప్ర‌భుత్వాలు ప‌లు సంద‌ర్భాల‌లో ఐదేళ్లు శిక్ష ప‌డిన ఖైదీల‌ను విడుద‌ల చేయడం జ‌రిగింది.

అలాగే జీవో ఎంఎస్ నెం.4, తేదీ 17.01.1995, జీవో ఎంఎస్ నెం.195, తేదీ 08.07.1995,జీవో ఎంఎస్ నెం.193, తేదీ 11.08.1997, జీవో ఎంఎస్ నెం.18, తేదీ 25.01.2000,జీవో ఎంఎస్ నెం.196, తేదీ 13.08.2004,జీవో ఎంఎస్ నెం.415, తేదీ 01.10.2009,జీవో ఎంఎస్ నెం.28, తేదీ 25.01.2011, జీవో ఎంఎస్ నెం.220, తేదీ 28.09.2013 ద్వారా 1995, 1997, 2000,2004, 2009, 2011, 2013 సంవ‌త్స‌రాల కాలంలో 7సంవ‌త్స‌రాల వాస్త‌వ శిక్ష‌, 3 సంవ‌త్స‌రాల రిమిష‌న్‌తో క‌లిపి ప‌దేళ్లు పూర్త‌యిన ఖైదీలంద‌రినీ విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌నే విష‌యాన్ని మీరు గ‌మ‌నించాల్సిందిగా కోరుతూ ఈరిప‌బ్లిక్ దినోత్స‌వం సంద‌ర్భంగానైనా ఖైదీల‌కు క్ష‌మాభిక్ష‌ను పెట్టి స్వేచ్ఛావాయువుల‌ను ప్ర‌సాదించాల‌ని త‌మ‌రిని కోరుతున్నాను.

 

 (రేవంత్ రెడ్డి)

Follow Us:
Download App:
  • android
  • ios