Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కలెక్టర్లకు కేసిఆర్ హెచ్చరిక

తెలంగాణ కలెక్టర్లకు ఉన్నతాధికారులు హెచ్చరిక పంపారు. ఆ హెచ్చరిక కూడా సిఎం కేసిఆర్ చేసినది కావడంతో హై అలర్ట్ తప్పని పరిస్థితి. ఇంతకూ సిఎం చేసిన హెచ్చరిక ఏంటి? కలెక్టర్లకు ఉన్నతాధికారులు అందించిన హెచ్చరిక ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

this is kcr s warning for collectors

హరితహారం పథకాన్ని తెలంగాణ సర్కారు టాప్ ప్రయార్టీ స్కీం గా తీసుకుంది. ఇక నుంచి హరితహారం అమలుపై సిఎం కేసిఆర్ నిరంతర స్వయం పర్యవేక్షణ చేస్తారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులకు చేరవేశారు. మంగళవారం సచివాలయం నుంచి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించిన అంశాలివి.

ఈ యేడాది హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు 32 కోట్లు దాటడం గొప్ప విషయం అని, అయితే నాటిన మొక్కలను బతికించినప్పడే తెలంగాణకు హరితహారం పథకం సార్థకమైనట్లని, ఆ దిశగా అధికారులు, సిబ్బంది పూర్తి నిబద్దతతో పనిచేయాలని సచివాలయం నుంచి ఉన్నతాధికారులు పిలుపు నిచ్చారు. మూడో విడత హరితహారం పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ది, అటవీ శాఖ అధికారులతో సచివాలయం నుంచి అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో విడత హరితహారం కొనసాగుతున్న తీరు,  వచ్చే ఏడాది హరితహారం పట్టణ, వచ్చే యేడాది హరితహారం సన్నాహకాలపై ప్రధానంగా సమావేశంలో సమీక్షించారు. ఇప్పటిదాకా నాటిన మొక్కల రక్షణ చర్యలు, బతుకుతున్న మొక్కల శాతాన్ని ముఖ్యమంత్రి జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారని, ఇకపై ప్రతీ పది హేను నుంచి నెల రోజుల్లో హరితహారం మొక్కల పరిస్థితిపై స్వయంగా కలెక్టర్లు నివేదిక పంపాలని రజత్ కుమార్ కోరారు. ఈ యేడాది లక్ష్యమైన నలభై కోట్ల మొక్కలను నాటేదాకా పనులు కొనసాగించాలని, నాటిన ప్రతీ ప్రదేశం, మొక్కలు తప్పని సరిగా 100 శాతం జియో ట్యాగింగ్ చేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు. జిల్లాల నుంచి పంపే రిపోర్టుల్లో విశ్వసనీయత ఉండాలని, మొక్కల సంఖ్యను లెక్కల్లో రాస్తే బాధ్యత తీరదని, అవి బతికితేనే హరితహారంతో ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందన్నారు.  

వచ్చే యేడాది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికతో హరితహారం నిర్వహించాలని, వార్డులు, డివిజన్ స్థాయిలో కూడా నర్సరీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెళ్లడించారు. దీంతో నర్సరీల సంఖ్య ప్రస్తుతం ఉన్న మూడు వేల నుంచి పది వేల దాకా పెరిగే అవకాశముందన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని, మనం నర్సరీల్లో పెంచిన మొక్కలనే ఇప్పటిదాకా ప్రజలకు ఇస్తున్నామని, అలా కాకుండా జనం కోరిన, డిమాండ్ ఉన్న మొక్కలే పంపిణీ చేసే విధంగా నర్సరీలు తయారు కావాలని చెప్పారు. మొక్కల ఎత్తు, నాణ్యత విషయంలో రాజీపడకుండా నర్సరీలను ఇప్పటినుంచే ప్రారంభించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, కేంద్ర నిధుల్లో ఆలస్యం వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నాయని, ఇకపై ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. ఆయా జిల్లాల్లో గ్రీన్ బ్రిగేడ్ లు పనిచేస్తున్న విధానంపై ప్రత్యేకంగా చర్చించారు. సమాజంలోని వివిధ వర్గాలను పచ్చదన్నాన్ని పెంచే యజ్జంలో భాగస్వాయ్యం చేయాలన్నారు. ఈ యేడాది రెండు కోట్లు ఈత మొక్కలను నాటడం టార్గెట్ గా పెట్టుకుంటే ఇప్పటిదాకా కోటీ ఇరవై మూడు లక్షలు సాధించామని, మిగతావి కూడా పూర్తి చేస్తామని ఎక్సయిజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ సమావేశంలో చెప్పారు.

నిరుపేదలకు చెట్ల ఫలాలపై హక్కును కలిపిస్తూ ప్రభుత్వం తీసుకున్న  చెట్టు - పట్టా అమలుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ నీతూకుమార్ ప్రసాద్ కోరారు. ఇక పట్టణ ప్రాంత అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల్లో జీ హెచ్ ఎం సీ, హెచ్ ఎం డీ ఏ ఏరియాల్లో మూడు చొప్పున కొత్త పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. పాడి రైతులతో హరితహారం విజయవంతం కావాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అనీ, బుధవారం నుంచి మొదలయ్యే పాడి రైతులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ కు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పి.కె. ఝా, ముఖ్యమంత్రి ఎస్డీ ప్రియాంక వర్గీస్, అడిషనల్ పీసీసీఎఫ్ డోబ్రియల్ తో పాటు  అటవీ,  గ్రామీణాభివృద్ధి, ఆర్ & బి, నీటి పారుదల, Excise, Ghmc, Hmda, సంక్షేమ శాఖల అధికారులు హాజరయ్యారు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                   

Follow Us:
Download App:
  • android
  • ios