గవర్నర్ కాంగ్రెస్ లో చేరిపోవాలి.. బీజేపీ, కాంగ్రెస్ లది ఫెవికాల్ బంధం - కేటీఆర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Telangana Governor Tamilisai Soundararajan) కాంగ్రెస్ (Congress) లో చేరి ఆ పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)లది ఫెవికాల్ బంధం అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చేదాక తమ ఫోకస్ మరల్చబోమని అన్నారు.
![The Governor should join the Congress. BJP and Congress have a fevicol bond: KTR..ISR The Governor should join the Congress. BJP and Congress have a fevicol bond: KTR..ISR](https://static-ai.asianetnews.com/images/01hkyq776krqbqahv40mgt1hxc/untitled-design--54--png_363x203xt.jpg)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. గవర్నర్ బీజేపీ కార్యకర్త అని తాను ఇంత కాలం అనుకున్నానని అన్నారు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోందని చెప్పారు. అయితే అధికారికంగానే ఆ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీపై అభిమానాన్ని చాటుకోవాలని ఎద్దేవా చేశారు.
‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి ’.. అంటూ కేటీఆర్ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించి అన్నారో ?
గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తాను పూర్తి ఖండిస్తున్నానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు బీజేపీ సహకరిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నట్టే ఇంకా భావిస్తున్నారని పదే పదే కాంగ్రెస్ నాయకులు అంటున్నారని తెలిపారు. కానీ ఆ పార్టీ నాయకులే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అందుకే తమను ఆడిపోసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి 50 రోజులు కావస్తోందని, అయినా తమను ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత విమర్శలు తప్పవని, కానీ తాము మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు మరవబోమని అన్నారు. ఈ హామీల్లో వంద రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలను అమలు చేసేదాకా ప్రజల ఫొకస్, తమ ఫొకస్ మరల్చకుండా చూసుకుంటామని తెలిపారు.
వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. మొదటి స్పందన ఏంటంటే ?
కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధం రోజు రోజుకు ప్రజలకు అర్థం అవుతోందని విమర్శించారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఒకే సారి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారని, శాసన మండలి చైర్మన్ వాటిని ఒకే సారి ఆమోదించారని కేటీఆర్ తెలిపారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీలు ఏర్పడ్డాయని అన్నారు. ఈ ఎన్నికలకు ఒకే సారి ఎన్నికలు జరగాల్సి ఉందని, కానీ ఢిల్లీలో ఏం మతలబు జరిగిందో తెలియదు గానీ.. రెండు సార్లు ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారని, గంట తరువాత రెండు ఎమ్మెల్సీలకు వేరు వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు బులిటెన్ వచ్చిందని తెలిపారు.
రైతులకు గుడ్ న్యూస్.. రూ. 2 లక్షల రుణ మాఫీపై తెలంగాణ గవర్నర్ కీలక ప్రకటన..
గవర్నర్ ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లకు ఆమోద్ర ముద్ర వేయడం, ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీలకు వేరు వేరుగా ఎన్నికలను నిర్వహిస్తున్న పద్దతలను చూస్తే కాంగ్రెస్ ను బీజేపీ జాకీలు పెట్టి లేపుతోందని అర్థమవుతోందని అన్నారు. ఇటీవల బండి సంజయ్ కూడా కాంగ్రెస్, బీజేపీ కోట్లాడుకోకుండా ముందు బీఆర్ఎస్ ను ఖతం చేద్దామని అన్నారని, రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నారని తెలిపారు. మొన్నటి వరకు తాము బీజేపీతో కలిసి ఉన్నామని అన్నారని, కానీ ఇప్పుడు ఎవరు ఎవరితో కలిసి ఉన్నారో చూడాలని అన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు.