తమ డిమాండ్స్‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. మే 7వ తేదీలోపు ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించక పోతే స‌మ్మెకు వెళ్తామ‌ని తేల్చి చెప్పారు. తాజాగా దీనిపై మంత్రి పొన్న ప్ర‌భాక‌ర్ స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..   

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెకు వెళ్లవద్దని కోరారు. సమ్మె చేస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ఆయన పిలుపునిచ్చారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి పొన్నంను సోమ‌వారం కలిశారు. తమ సమస్యలను వివరించారు.

స్పందించిన మంత్రి  ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమ్మె చేపట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తానూ ఉద్యోగుల సమస్యలు వినేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సంరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

ఆర్టీసీ అప్పుల నుంచి బయటపడుతోంది కాబట్టి ఇలాంటి సమయంలో సమ్మె అవసరం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. గ‌తంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు, ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు. ఉద్యోగుల సహకార సంఘం (CCS), ప్రావిడెంట్ ఫండ్ (PF) నిధులను ఉపయోగించారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన బాండ్లకు సంబంధించి రూ. 400 కోట్లను చెల్లించింది. పీఎఫ్ క్లెయిమ్‌ల‌ను చెల్లించేందుకు రూ. 1,039 కోట్లు ఇచ్చింది. సీసీఎస్ క్లెయిల్‌ల కోసం రూ. 345 కోట్లు చెల్లించిందని తెలిపారు. అలాగే కారుణ్య నియామ‌కం ద్వారా 1500 మందిని నియ‌మించామ‌ని, మరో 3,038 కొత్త ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత వారం ఉద్యోగులను సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేశారు. "ఆర్టీసీ మన సంస్థ. ఇప్పుడు లాభాల్లోకి వస్తోంది. అందుకే దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని సిఎం అన్నారు.  ఇదిలా ఉంటే జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమ్మె చేపడతామని ప్రకటించింది. ఈ విష‌య‌మై రేవంత్ మాట్లాడుతూ.. సంస్థకు లాభాలు వస్తున్నాయి, ఆ డబ్బును ఉద్యోగుల చేతిలో ఉంచుతాం, దాన్ని ఎలా ఖర్చు చేయాలో మీరు చెప్పండి అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని గుర్తు చేసి, ఉద్యోగులను నిర్ణయం పునఃసమీక్షించమని విజ్ఞప్తి చేశారు. మ‌రి ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.