ఆదిలాబాద్ లో టెన్షన్ టెన్షన్..
- లంబాడీలపై దాడికి దిగిన ఆదివాసీలు
- కుమ్రంభీం విగ్రహానికి చెప్పుల మాల వేశారని ఆగ్రహం
- షాపులు తగలబెట్టిన ఆదివాసీలు
- లాఠీఛార్జి భాష్పవాయు గోళాల ప్రయోగం
ప్రశాంతతకు మారుపేరు, అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు స్థానిక లంబాడీలపై కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలోని ఉస్నాపూర్ తండాలో ఈ దాడులు జరిగాయి. అయితే కుమ్రం భీం విగ్రహానికి చెప్పుల మాల వేసినందుకు ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేసి దాడులకు దిగినట్లు తెలుస్తోంది. అయితే చెప్పులమాల వేసింది లంబాడీ ప్రజలేనా అన్నది ఇంకా తేలలేదు.
ఈ దాడులతో ఆదిలాబాద్ లో అలజడి రేగింది. పలు షాపులను ఆదివాసీలు తగులబెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.
అయినా ఇంకా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో భాష్పవాయు గాళాలు ప్రయోగించారు. ఈ ఆందోళనల తాలూకు మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.