వైఎస్ షర్మిల ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: అప్పుడే అసమ్మతిరాగాలు
తెలంగాణలో రాజన్న సంక్షేమం రాజ్యం తేవాలని ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో అప్పుడే అసమ్మతి రాగం వినపడుతోంది. తాజాగా శనివారం ఇద్దరు వ్యక్తులు పార్టీ కార్యాలయం వద్ద హంగామా సృష్టించారు. పదవులను అమ్ముకుంటున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల నివాసం వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్టీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆ ఇద్దరు యువకులు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గంగాధర్, రజిత్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, తెలంగాణలో రాజన్న సంక్షేమం రాజ్యం తేవాలని ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో అప్పుడే అసమ్మతి రాగం వినపడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం అండగా ఉంటామని వచ్చిన నేతలు.. ఒక్కొక్కరిగా జారిపోతున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కీలక నేతలు చేవెళ్ల ప్రతాప్రెడ్డి, కేటీ నర్సింహారెడ్డి వైఎస్ఆర్టీపీకి గుడ్బై చెప్పడం కలకలం రేపింది. ముఖ్యంగా షర్మిల ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ కీలక నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి ఇద్దరు నేతలు పంపించారు.
Also Read:షర్మిల పార్టీలో పదవుల అమ్మకం... రూ.5లక్షలకే..: సొంత పార్టీ నాయకుడి సంచలనం (వీడియో)
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వైఎస్సార్ టీపీ ఇన్చార్జ్గా ప్రతాప్రెడ్డి వ్యవహరిస్తుంటే... జిల్లాలో కీలక నేతగా కేటీ నర్సింహారెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. అన్ని జిల్లాలను చుట్టేయాలని ఆమె భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్ టీపీకి చేవెళ్ల ప్రతాప్రెడ్డి, కేటీ నర్సింహారెడ్డి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తాము రాజీనామా చేయడానికి రాఘవరెడ్డే కారణమని చెబుతున్నారు. దీన్నిబట్టి వైఎస్ఆర్టీపీలో ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.