షర్మిల పార్టీలో పదవుల అమ్మకం... రూ.5లక్షలకే..: సొంత పార్టీ నాయకుడి సంచలనం (వీడియో)
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ టిపి పార్టీలో అప్పుడే పదవుల కోసం వివాదాలు మొదలయ్యాయి.
హైదరాబాద్: ఆవిర్భవించి నెల రోజులు కూడా గడవకముందే వెఎస్సార్ తెలంగాణ పార్టీలో అలజడి మొదలయ్యింది. ఆ పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నాయకుడే సంచలన ఆరోపణలు చేశాడు. పార్టీ పదవుల కేటాయింపుపై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర కార్యాలయంలోనే అతడు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు రభస సాగింది.
మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో ఆయన కూతురు షర్మిల స్థాపించిన వైఎస్సార్ టిపి లో చేరినట్లు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి తెలిపారు. అయితే అర్హులైన వారికి, పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కాకుండా కేవలం లక్షలకు లక్షలు గుమ్మరించే వారికే పదవులు ఇస్తున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పదవులు రూ.5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీడియో
''ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళని వ్యతిరేకించడం లేదు... పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నా. నేను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నా. అలాంటి నన్ను కాదని ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారు. పార్టీలో ఎవరు ఎవరికి సీట్లు అమ్ముకున్నారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. తాగుబోతు గాళ్ళకి పదవులు అమ్ముకొన్నారు'' అంటూ నర్సింహరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
read more ప్రయోగం: వైఎస్ షర్మిల వ్యూహకర్త ప్రియ వెనక ప్రశాంత్ కిశోర్
ఇదిలావుంంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, డిస్కంలకు డబ్బులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని ఆమె అన్నారు.
కానీ, ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని చెప్పారు. మేఘా కంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని షర్మిల ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తిపడి అక్కరకు రాని పనులు చేస్తే గిట్లనే ఉంటది కేసీఆర్ దొర అంటూ షర్మిల విమర్శించారు.