భారీ వర్షాలకు కొడంగల్-తాండూరు మధ్యలో కొట్టుకుపోయిన వంతెన
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు కురిసిన భారీ వర్షాలకు కొడంగల్-తాండూరు మధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఈ మార్గంలో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు కురిసిన భారీ వర్షాలకు కొడంగల్-తాండూరు మధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఈ మార్గంలో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.
ఎగువన కురిసిన భారీ వర్షాలతో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరు వద్ద కాగ్నా నదికి వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు వద్ద కాగ్నా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. నాలుగేళ్లుగా కొత్త బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాల రాకపోకల కోసం తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.
గురువారం నాడు కురిసిన వర్షాలకు కొడంగల్-తాండూరు మధ్య కాగ్నా నదిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఎటువైపు వాహనాలు అటే నిలిచిపోయాయి. ధరూర్, కుల్కచర్ల, పెద్దేముల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కాగ్నా నదికి వరద పోటెత్తినట్టుగా స్థానికులు చెబుతున్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో 17.2 సెం.మీ,మహబూబ్నగర్ జిల్లా ధన్వాడలో 17 సెం.మీ,మహబూబ్నగర్లో 13.9 సెం.మీ,మహబూబాబాద్లో 13.6 సెం.మీ,
సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లెలో 11 సెం.మీ, హైదరాబాద్ రాజేంద్రనగర్లో 10.2 సెం.మీ,వికారాబాద్ జిల్లా ధారూర్లో 9.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.