అమెరికాలో హైదరాబాద్ టెక్కీ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాదుకు చెందిన టెక్కీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
హైదరాబాద్: అమెరికాలో హైదరాబాదుకు చెందిన టెక్కీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అమెరికాలోని షికాగోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంబారిపేట కృష్ణప్రసాద్ (33) అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
ఆ విషయాన్ని అమెరికా పోలీసులు శుక్రవారం అతని తండ్రి రాంప్రసాద్కు తెలియజేశారు. అందుకు సంబంధించిన వివరాలను రాంప్రసాద్ మీడియాకు చెప్పారు. రామంతాపూర్ శాంతినగర్కు చెందిన కృష్ణప్రసాద్ ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. కాగోలోని హంటర్డ్రైవ్ అపార్ట్మెంట్–2ఏలో ఉంటూ విటెక్ కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు.
గురువారం అతని గది తలుపులు ఎంతకూ తెరుచుకోలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గది తలుపులు తెరచి చూడగా కృష్ణప్రసాద్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని రాంప్రసాద్ అన్నారు.
కృష్ణప్రసాద్ కు భార్య మైథిలి, కూతురు సాహితి, కుమారుడు అర్జున్ ఉన్నారు. భార్యాపిల్లలు హైదరాబాదులో ఉంటున్నారు. కృష్ణప్రసాద్ ఒక్కడే షికాగోలో ఉంటున్నాడు. అతని మృతదేహాన్ని హైదరాబాద్ తరలించడానికి రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉంది.