Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ 9 ఏళ్ల అభివృద్ది ప‌య‌నం దేశానికి ఆదర్శం: కేటీఆర్

Hyderabad: తొమ్మిదేళ్లలో తెలంగాణ పరివర్తన భారతదేశానికి ఆదర్శమ‌ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. రాజన్న-సిరిసిల్ల హబ్‌లో మొత్తం 10 వేల ఉద్యోగాలు వస్తాయనీ, దాదాపు 5 వేల మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు.
 

Telanganas 9-year development journey is ideal for India: KTR RMA
Author
First Published Jun 3, 2023, 4:38 PM IST

Telangana IT minister KT Rama Rao (KTR): తొమ్మిదేళ్లుగా ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా అమలవుతుండటంతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకుంటున్నాయన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగించడం వల్లే తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ టెక్స్ టైల్ పట్టణం సిరిసిల్ల..

తెలంగాణ ఆవిర్భావానికి ముందు పాలకుల ఉదాసీనత కారణంగా పవర్ లూమ్ రంగంలో సంక్షోభంలో కూరుకుపోయిన నేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులకు ఇప్పుడు భరోసాతో కూడిన ఆర్డర్లు, సుస్థిర ఆదాయం లభిస్తోందని కేటీఆర్ అన్నారు. ఇతర రంగాల అభివృద్ధిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ పథకాలకు ముగ్ధులైన ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నార‌ని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అరకొర నిధులు కేటాయించాయనీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రంగానికి 20 రెట్లు అదనపు నిధులు ఖర్చు చేశామని కేటీఆర్ తెలిపారు.

ఆర్థిక శ‌క్తిగా తెలంగాణ‌.. 

దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందనీ, 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతం వార్షిక జీఎస్‌డీపీతో దేశంలో మూడో స్థానంలో నిలిచిందని కేటీఆర్‌ వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర వార్షిక జీఎస్డీపీ 12 శాతం మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు 13.4 శాతం కంటే తక్కువని తెలిపారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తితో జిల్లాలో 2.52 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ప్యాకేజీ 1, 39, 9, 10 కింద 11.12 లక్షల ఎకరాలకు నీరు అందుతుండగా, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు రిజర్వాయర్ల కింద 55,980 ఎకరాలకు నీరు అందుతోందని కేటీఆర్ తెలిపారు.

మైనర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మరో 57,146 ఎకరాలు సాగు చేస్తున్నారు. ప్యాకేజీ-9లో భాగంగా చేపడుతున్న మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ఇటీవలే చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. రిజర్వాయర్ పూర్తయితే వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్లలో మరో 96,150 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ హబ్ లో మొత్తం 10 వేల ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా 5 వేల మంది స్థానికులకు ఉపాధి లభించనుంద‌ని తెలిపారు.  త్వరలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామ‌నీ, ఆక్వా హబ్ తో రైల్వే లింక్ ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా కేటీఆర్ వెల్ల‌డించారు.

Follow Us:
Download App:
  • android
  • ios