Telangana mobile recovery: దేశంలో పోయిన మొబైల్ ఫోన్లను అత్యధికంగా తిరిగి రికవరీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. చోరీకి గురైన మొత్తం 78,114 మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేశారు.
Telangana mobile recovery: దేశంలో పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మే 19, 2025 నాటికి మొత్తం 78,114 మొబైల్ పరికరాలను తిరిగి పొందుతూ రాష్ట్రం దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. ఈ గణాంకాలను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) డ్యాష్బోర్డ్ విడుదల చేసింది.
తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ మంగళవారం ఒక అధికారిక ప్రకటనలో ఈ సమాచారాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని ఈ అపూర్వ విజయాన్ని దేశంలో మైలురాయిగా పేర్కొన్నారు. తీవ్రమైన సమన్వయం, గ్రామ స్థాయి పోలీస్ అధికారుల కృషి ఈ విజయం వెనుక వుందని తెలిపారు.
ట్రాక్టబిలిటీ రిపోర్టుల రోజువారీ మానిటరింగ్ తోనే ఈ ఫలితాలు
కేసులు నమోదు చేయడం నుంచి మొబైల్ ట్రాకింగ్, ట్రాక్టబిలిటీ రిపోర్టుల రోజువారీ మానిటరింగ్, మొబైల్ను కలిగి ఉన్న వ్యక్తులతో సంప్రదింపులు, పరికరాల స్వాధీనం, వాటిని యజమానులకు అందజేసే వరకు ప్రతి దశను శ్రద్ధగా నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ 11,879 మొబైల్లను, సైబరాబాద్ 10,385, రాచకొండ 8,681 మొబైల్ ఫోన్లను పునరుద్ధరించాయి. ఇవే అత్యధిక రికవరీ నమోదైన మూడు జిల్లాలుగా నిలిచాయి.
సీఈఐఆర్ పోర్టల్ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్ (www.tspolice.gov.in)తో అనుసంధానం చేయడం వల్ల పౌరులకు మరింత సులభతరం అయింది. వారు తమ పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ పరికరాల వివరాలను www.ceir.gov.in ద్వారా కూడా నమోదు చేయవచ్చు.
సీఈఐఆర్ పోర్టల్ను టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) అభివృద్ధి చేయగా, తెలంగాణలో దానిని అమలు చేయడానికి CID నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్లలో ఇది అమలులో ఉంది.
2023 ఏప్రిల్ 19న తెలంగాణలో సీఈఐఆర్ సేవలు
సీఈఐఆర్ను 2022 సెప్టెంబర్ 5న కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తెలంగాణలో మాత్రం ఇది 2023 ఏప్రిల్ 19న ప్రారంభమైంది. అంటే మిగతా రాష్ట్రాల కంటే 227 రోజుల ప్రారంభించారు. అయినా సరే, తెలంగాణ అత్యధిక మొబైల్ రికవరీ సాధించిన రాష్ట్రంగా నిలవడం గమనార్హం.
ఈ విజయానికి గల ముఖ్య కారణాలలో ప్రామాణిక క్రియాశీలత, సాంకేతిక అనుసంధానం, పౌర స్నేహపూర్వక విధానాలే అని సీఐడి డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ వెల్లడించారు. పోర్టల్ వినియోగంలో పౌరుల నుంచి వచ్చిన సానుకూల అభిప్రాయాలు కూడా ఈ ప్రక్రియ ప్రభావవంతంగా ఉందనడానికి నిదర్శనంగా నిలిచాయి.