త్వరలో నిజామాబాద్లో ఐటి టవర్
- త్వరలో నిజాంబాద్ లో ఐటి టవర్ నిర్మాణమవుతుంది.
- ఐటి మంత్రి కెటిఆర్ ఈ ప్రతిపాదనకు ఒకె చెప్పారు
నిజామాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రస్తుతం ఖమ్మంలో ఐటి టవర్ను రూ.25 కోట్లతో నిర్మిస్తున్నారని, నిజామాబాద్లోనూ అలాంటి టవర్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యుగులకు ఉద్యోగాలు లభిస్తాయని తాను ఐటి మంత్రి కెటిఆర్ను కోరినట్లు కవిత తెలిపారు. కెటిఆర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే రూ. 25 కోట్లతో నిజామాబాద్లో ఐటి టవర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె ప్రకటించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఐటి రంగ నిపుణులు ఎంఓయు కుదర్చుకునేందుకు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్కే పరిమితమయిన పారిశ్రామికాభివృద్ధిని జిల్లాలకూ విస్తరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారని పరిశ్రమల ఏర్పాటుకు వస్తే అవసరమయిన విద్యుత్, వాటర్ను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నదని ఆమె చెప్పారు. 24 గంటల పాటు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ప్రశంసిస్తూ గతంలో కరెంటు కోతలకు నిరసనగా ఇందిరాపార్కు వద్ద దర్నాలు జరిగేవని, సిఎం కేసిఆర్ ప్లానింగ్తో ఆ పరిస్థితి లేకుండా చేశారని ఆమె అన్నారు.
బుధవారం నిజామాబాద్లో జరిగిన నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ బాధ్యతల స్వీకారోత్సవానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్మభంగా ఆమె మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
స్పేస్ పార్క్ కూడా వస్తుంది
వ్యవసాయాధారిత జిల్లా అయిన నిజామాబాద్లోఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి...లక్కంపల్లిలో పెండింగ్లో ఉన్న ఎస్ ఇ జడ్ పనులకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ చేత ప్రారంభించిన విషయం మీకు తెలిసిందేనన్నారు. పతంజలి సిఇఓ బాలకృష్ణను కూడా ఎస్ ఇ జడ్ను చూపించామని, రూ.100 కోట్లతో పతంజలి యూనిట్ను 200 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారన్నారు. వారికి అవసరమైన స్థలం కోసం చూస్తున్నట్లు కవిత వివరించారు. నిజామాబాద్లో పసుపు సాగు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పసుపు ఆధారిత పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం మ ద్ధతు కూడగడుతున్నామని, .ప్రధానిని కూడా కలిసిన విషయం తెలిసిందేనన్నారు. స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 42 ఎకరాలను సేకరించిందని ఆమె చెప్పారు.