తెలంగాణా టీచర్ ఉద్యోగాలకు మోక్షమెపుడో...
- జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై స్పష్టత కరువు
- టెట్ నిర్వహణపై ఇంకా క్లారిటీ లేదు
- ఇప్పటికీ సిలబస్ ప్రకటించని ప్రభుత్వం
- సుప్రీం ఇచ్చిన గడువు దగ్గరపడుతున్నా కనిపించని హడావుడి
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా నాన్చూతూనే ఉంది. లక్షలాది మంది నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ, ఉద్యోగం గురించి కలలు కంటూ ఉంటే, ప్రభుత్వంలో ప్రకటనలు వెలవడినంత వేగంగా కార్యాచరణ కనిపించడం లేదు. ఈనెల మూడో తేదీన 8792 పోస్టులను భర్తీ చేస్తామని ఎంతో అట్టహాసంగా ప్రకటించారు. 15 రోజులలో నోటిఫికేషన్ వెలువడుతుందని వూరించారు. ఈ ప్రకటనచేసిందెవరో కాదు, రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.
ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటనమీద ఎలాంటి ప్రగతి కనిపించడం లేదు. సరయిన క్లారిటీ లేదు. అంతా గందరగోళమే. ఇది నిరుద్యోగులను, వారి కుటుంబాలను ఎంత ఆందోళనకు గురిచేస్తుంటుందో చెప్పలేం. ఇంతవరకు జిల్లాల వారీగా పోస్టులెన్నో ప్రకటించలేదు. టెట్ నిర్వహణ, సిలబస్ ఏమిటి, ఇంగ్లీష్ మీడియం పోస్టుల భర్తీ వంటి ఆంశాలు తేలనే లేదు.
మూడునెలల్లో ఉపాద్యాయ ఖాలీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పాక చేసిన హడావిడి ఇదంతా అనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి రెండునెలలవుతూ ఉంది. ఈరెండు నెలల్లో జరిగిందంతా ఎన్ని పోస్టులున్నాయో చెప్పడం తప్ప మరొక చర్య చేపట్టలేదు. విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయాలయిన ఏ జిల్లాలో ఎన్నిపోస్టులున్నాయి, ఏ సబ్జక్టులో ఎన్ని పోస్టులు న్నాయి, ఎస్జీటిపోస్టులెన్ని, స్కూల్ అసిస్టెంట్లు ఎందరు, సిలబస్ ఏమిటి అనే వాటి మీద స్పష్టత ఇవ్వలేదు. జాప్యానికి చెబుతున్న కారణం బలంగా లేదు.
గురుకుల పాఠశాలల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లో తప్పులు దొర్లడం, రద్దు చేయడం జరగడంతో అలాంటి పరిస్థితి పునారవృతం కాకుండా ఉండేందుకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనీ, అందువల్లే నోటిఫికేషన్ జాప్యం అవుతున్నదని అధికార వర్గలు చెబుతున్నాయి. ఇది నమ్మశక్యంగా లేదని నిరుద్యోగులంటున్నారు.