రాఖీ పండుగకు 3 వేల స్పెషల్ బస్సులు.. మూడు రోజులపాటు నడపనున్న టీఎస్ఆర్టీసీ
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ మూడు రోజుల్లో అదనంగా వెయ్యి చొప్పున స్పెషల్ బస్సులను నడుపనుంది. ఆయా రూట్లలో రద్దీ బట్టి వీటిని నడుపుతారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్: రాఖీ పండుగకు దాదాపు ప్రతి మహిళ ప్రయాణం చేస్తుంది. తమ సోదరులకు రాఖీ కట్టడానికి పలు గ్రామాలకు వెళ్లుతారు. దీంతో సాధారణంగా రద్దీ పెరుగుతుంది. ఈ రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు.
రక్షా బంధన్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 29వ తేదీ, 30వ తేదీ, 31వ తేదీల్లో వెయ్యేసి చొప్పున స్పెషల్ బస్సులు నడుపుతుంది. ఈ బస్సులు రద్దీని బట్టి ఆయా మార్గాల్లో నడుపుతారు.
పండుగ వచ్చిందంటే.. హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్లు ప్రయాణికులతో నిండిపోతుంది. ఈ సందర్బంగానే ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, గోదావరిఖని, మంచిర్యాల సహా ఇతర రూట్లలో ఈ స్పెషల్ బస్సులను నడుపుతారు. రద్దీని బట్టి జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లు సహా ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలని సజ్జనార్ ఆదేశించారు.
Also Read: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పరీక్షలో చీటింగ్.. హర్యానా నుంచి ముగ్గురు అరెస్టు
గతేడాది రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 12న టీఎస్ఆర్టీసీ మంచి ఆదాయం సంపాదించింది. ఒక్క రోజే సుమారు రూ. 20 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ సంపాదించుకుందని సజ్జనార్ గుర్తు చేశారు. ఈ సారి కూడా సిబ్బంది డెడికేషన్తో పని చేయాలని సూచనలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన తర్వాత తమపై బాధ్యత పెరిగిందని తెలిపారు.