తెలంగాణ పోలీసుల్లో స్వామి భక్తి విపరీతంగా పెరిగిపోతోంది. అధికార పక్షానికి ఎవరైనా ఎదురు తిరిగితే అంతే సంగతులు. అన్నం పెట్టే రైతన్నలకు బేడీ లేస్తున్నారు. పేదల కోసం పోరాడే ప్రజా నేతల రక్తం కళ్ల చూస్తున్నారు. 

బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తుంటే ఆయనకు మద్దతుగా తెలంగాణ పోలీసులు రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు.

ఇటీవల కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులను అవమానించడంతో గులాబీ సర్కారు భగ్గుమంది. అయినను జైళ్లో పెడుతామని హెచ్చరించింది.

అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పోలీసులను కన్నబిడ్డల్లా చూసుకుంటుంది.

ప్రభుత్వంలోకి వచ్చిన మొదట్లోనే కోట్లు ఖర్చుబెట్టి పోలీసు స్టేషన్ లకు ఏసీ వాహనాలను సమకూర్చింది.

నిరుద్యోగులందరూ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే మూడేళ్లలో కేవలం కానిస్టేబుల్ పోస్టులు మాత్రమే భర్తీ చేసింది.

నయింతో అంటకాగిన పోలీసులపై కంటితుడుపు చర్యలు తీసుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది.

ఇటీవల ఖమ్మం మిర్చి యార్డులో మద్దతు ధరకోసం రైతన్నలు ధర్నా చేస్తే పోలీసులు లాఠీలతో వారిని చితకబాదారు. వారిని ఉద్రవాదుల్లా చూస్తూ బేడీలు వేసి కోర్టులకు తీసుకెళ్లారు.

ఇప్పుడేమో ధర్నా చౌక్ తరలింపు కోసం గులాబీ నేతలతో పోటీపడి మరీ వారే ధర్నాకు దిగుతున్నారు.

వరంగల్ పోలీసులు హైదరాబాద్ వచ్చి మరీ ధర్నా చౌక్ ఎత్తివేత కోసం పోరాడటం చూస్తుంటే వారి స్వామి భక్తి ఏపాటితో ఇట్టే తెలియడం లేదు.

అంతెందుకు సర్కారు కూడా వారి భక్తికి మెచ్చి బిర్యానీ ప్యాకెట్లు పంపిస్తూ ధర్నా చౌక్ లో వారు మరింత బలంగా నినదించేందుకు తోడ్పాటు అందిస్తుంది.

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసే నిరసనకారుల నడ్డి విరగ్గొట్టే ఖాకీలను దగ్గరుండి ప్రోత్సహిస్తుంది.

ఇలా అధికారపక్షం, పోలీసు వర్గం పరస్పరం సహకరించుకుంటూ బంగారు తెలంగాణ కోసం చాలా కసరత్తులు చేస్తున్నారు. అడ్డొస్తున్న నిరసనకారుల రక్తాన్ని ఇలా కళ్ల జూస్తున్నారు.