కరోనా వ్యాక్సిన్: తెలంగాణలో 80 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహలు
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నాహలు చేస్తోంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆదివారం నాడు ఈ మేరకు డీసీజీఐ డైరెక్టర్ సోమాని ప్రకటించారు.
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నాహలు చేస్తోంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆదివారం నాడు ఈ మేరకు డీసీజీఐ డైరెక్టర్ సోమాని ప్రకటించారు.
త్వరలోనే దేశంలో ఈ రెండు వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే డ్రైరన్ కూడా చేపట్టారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రైరన్ విజయవంతంగా పూర్తి చేశారు.
తెలంగాణలో తొలి దశలో 80 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహలు చేస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమావేశాలు నిర్వహించారు.
కరోనా వ్యాక్సిన్ ను స్టోరేజీ చేసేందుకు రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజీలను వైద్య ఆరోగ్య శాఖ సిద్దం చేసింది. కరోనా వారియర్స్, పారిశుద్య సిబ్బంది, పోలీసులకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
కరోనా వారియర్స్ తర్వాత 50 ఏళ్ల దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్లాన్ చేస్తున్నారు. 18-50 ఏళ్ల మధ్యలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ అందించనున్నారు.
తెలంగాణకు తొలుత 5 లక్షల డోసుల వ్యాక్సిన్ రానుంది. ఆ తర్వాత 10 లక్షల డోసులు రానున్నాయి. ఆ తర్వాత కోటి డోసుల వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.