ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలంగాణ పైలట్ వినయ్ భాను రెడ్డి మృతి...
గురువారం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పైలట్ వినయ్ భాను రెడ్డి తెలంగాణ వాసి. యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం ఆయన స్వస్థలం.
యాదాద్రి : భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా అరుణాచల్ ప్రదేశ్ లో గురువారం ఉదయం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఇందులో చనిపోయిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ వివిరెడ్డి తెలంగాణ వాసి కావడం గమనార్హం. తెలంగాణలోని యాదాద్రి జిల్లా బొమ్మలరామారం ఆయన స్వస్థలం. వీవీబీ రెడ్డి మరణంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
వీవీబీ రెడ్డి పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. ఉప్పల నరసింహారెడ్డి, విజయలక్ష్మిలు ఆయన తల్లిదండ్రులు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో వినయ్ భాను కుటుంబం నివాసం ఉంటుంది. ఆయనకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య స్పందన ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు అనిక 6 సంవత్సరాలు, హర్విక 4 సంవత్సరాలు.
Army Chopper Crash: కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్ చీతా , ఇద్దరు పైలట్లు మృతి
భారత ఆర్మీకి చెందిన చీతా ఎయిర్ క్రాఫ్ట్ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంగే గ్రామం నుంచి అసోం సోనిట్ పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. టేక్ ఆఫ్ అయిన పావుగంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎయిర్ క్రాఫ్ట్ కోసం వెతికిన ఆర్మీ వర్గాలకు.. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్టుగా గుర్తించారు.
ఆ సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న పైలెట్ లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి, కో పైలట్ మేజర్ జయంత్ ఆచూకీ తెలియలేదు. దీంతో వారికోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. వారిద్దరూ మృతి చెందినట్లుగా చివరికి ఆర్మీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.