Telangana MLC Polls: ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఆరు స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (Telangana MLC Polls) సందర్భంగా ఖమ్మం (khammam) జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (Telangana MLC Polls) సందర్భంగా ఖమ్మం (khammam) జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇష్టారీతిగా వ్యవమరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఇతర టీఆర్ఎస్ నేతలు పోలింగ్ కేంద్రంలో తిరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు చెప్పిన పట్టించుకోవడం లేదని.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ధర్నాకు దిగారు.
ఈ క్రమంలోనే నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు.. పోలింగ్ కేంద్రంలోని చొచ్చుకుని పోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులతో కాంగ్రెస్ నాయకుల వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Also Read: Telangana MLC Polls: తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
ఇక, ఖమ్మంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో అభ్యర్థిని నిలిపింది. అంతేకాకుండా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ తమ మద్దతుదారులను గోవాకు తరలించిన క్యాంపు ఏర్పాటు చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ మద్దతుదారులను కూడా కాపాడుకునే యత్నం చేసింది. అయితే టీఆర్ఎస్కు మెజారిటీ ఉన్నప్పటికీ.. క్రాస్ ఓటింగ్ టెన్షన్ వెంటాడుతుంది. మరోవైపు స్వతంత్ర ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది సస్పెన్స్గా మారింది. ఇక, నేడు సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలక వరకు ఖమ్మం జిల్లాలో 21.22 శాతం పోలింగ్ నమోదైంది.