కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు గురువారం నాడు భేటీ అయ్యారు.  వరి ధాన్యం కొనుగోలు చేయాలని వినతి పత్రం సమర్పించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ఆహార శాఖ మంత్రి Piyush Goyal తో తెలంగాణ మంత్రులు గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. Punjab రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టుగానే తెలంగాణ నుండి Paddy ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రులు డిమాండ్ చేశారు.

గురువారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలోని పీయూష్ గోయల్ చాంబర్ లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , TRS ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి తదితరలు భేటీ అయ్యారు.

యాసంగిలో రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇదే విషయమై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ కూడా రాశారు. పీయూష్ గోయల్ ను తెలంగాణ మంత్రుల బృందం బుధవారం నాడు కలిసింది. అయితే ఇవాళ కలుద్దామని కేంద్ర మంత్రి తెలంగాణ మంత్రులకు సూచించారు. దీంతో ఇవాళ తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు.

పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం సాధ్యం కాదనే సంకేతాలు కేంద్రం నిన్ననే ఇచ్చింది. సరఫరా పరిస్ధితుల ఆధారంగానే వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంకేతాలు ఇచ్చారు.

అయితే ఇవాళ తెలంగాణ మంత్రుల డిమాండ్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుండి ఏ రకమైన స్పందిస్తారోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి దేశమంతా ఒకే రకమైన పాలసీ ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది. పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తెలంగాణ నుండి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.

తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయకపోతే తెలంగాణ తరహా పోరాటం చేస్తామని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చే హామీ మేరకే టీఆర్ఎస్ కార్యాచరణ ఉండనుంది.అయితే గత ఏడాదిలో కూడా వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కూడా కేంద్రంపై తెలంగాణ ,ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతోనే తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.