Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరం: బీజేపీని వెనుకేసుకొచ్చిన కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జరిగిన చర్చలో  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల విషయంలో  రాష్ట్ర అసెంబ్లీలో  ఆసక్తికర చర్చ జరిగింది.

Telangana Minister Uttam kumar Reddy Supports union government in  Telangana Assembly lns
Author
First Published Dec 20, 2023, 3:47 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో  వ్యవసాయ రంగానికి విద్యుత్ విషయమై  రైతుల నుండి చార్జీలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలు సూచించలేదని  తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేసిన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీపై  మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శలు చేస్తున్న సమయంలో  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  జోక్యం చేసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  బుధవారంనాడు శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  స్వల్పకాలిక చర్చను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.  ఈ చర్చలో  భారత రాష్ట్ర సమితి తరపున మాజీ మంత్రి హరీష్ రావు చర్చలో పాల్గొన్నారు.

తమ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం మేరకు  0.5 శాతం అప్పు తీసుకొనేందుకు  వ్యవసాయ మోటార్లకు  మీటర్లు పెట్టాలని కేంద్రం షరతు విధించిందన్నారు. అయితే  వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు తమ ప్రభుత్వం అంగీకరించలేదని  హరీష్ రావు గుర్తు చేశారు. దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడ  వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి  అప్పులు తీసుకున్నాయని హరీష్ రావు  చెప్పారు. బోరు బావులకు మీటర్లు పెట్టవద్దని కూడ  కాంగ్రెస్ సర్కార్ ను హరీష్ రావు కోరారు.

అయితే ఈ సమయంలో తెలంగాణ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కు  రైతుల నుండి చార్జీ వసూలు చేయాలని  ఏ చట్టం చెప్పలేదని  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  వ్యవసాయానికి మీటర్ల విషయంలో  అబద్దాలు మాట్లాడారని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  విమర్శించారు. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాదిరిగానే ఇవాళ మీరు కూడ అబద్దాలు మాట్లాడుతున్నారని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతుల నుండి బిల్లులు(చార్జీలు) వసూలు చేయాలని కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన  సంస్కరణలు చెప్పలేదన్నారు.

ఈ పార్లమెంట్ కమిటీలో తాను  గతంలో సభ్యుడిగా పనిచేసినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అవాస్తవాలను పదే పదే అసెంబ్లీలో  ప్రస్తావించవద్దని  ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. వెంటనే  మాజీ మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ  బోరు బావుల వద్ద మీటర్లు పెట్టాలనేది నిజమా కాదా  చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. దీంతో  మరోసారి  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాట్లాడారు. రైతుల నుండి  చార్జీలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణల్లో  ఉందని హరీష్ రావు అసెంబ్లీలో ఇప్పుడే చెప్పారన్నారు. అయితే విద్యుత్ సంస్కరణలకు సంబంధించి  రైతుల నుండి చార్జీలు వసూలు చేయాలని  ఎక్కడా కూడ లేదని  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన  విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని ఉందో లేదా చెప్పాలని ప్రశ్నించారు. రైతులు ఎంత విద్యుత్ ను ఉపయోగించారో లెక్క తేల్చాలని  ఉందో లేదో వివరించాలని హరీష్ రావు కోరారు. 

దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి అదే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో  రైతుల నుండి  చార్జీ వసూలు చేయాలని లేదన్నారు.  రైతుల నుండి బిల్లు వసూలు చేయాలని లేదని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  వివరించారు.  అయితే మీటర్లు పెట్టాలని కేంద్రం  ఆ విద్యుత్ సంస్కరణల విషయంలో  చెప్పిందని ఒప్పుకున్నందుకు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి  హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో  గ్యాస్ సిలిండర్ కు పూర్తి ధర చెల్లిస్తే తాము సబ్సిడీని చెల్లిస్తామని  కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు.  గ్యాస్ సిలిండర్ కు పూర్తి ధర చెల్లించిన తర్వాత సబ్సిడీని చెల్లించడం కేంద్రం ప్రభుత్వం ఎత్తివేసిందని  హరీష్ రావు గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios