తెలంగాణకు మోడీ ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్ని... ‘‘సున్నా’’ : కేటీఆర్ చురకలు
తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. డీ తెలంగాణకు ఏ మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదని ఆరోపించారు.
తెలంగాణలో గత కొన్నిరోజులుగా బీజేపీ- టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. రాజాసింగ్ అరెస్ట్, బండి సంజయ్ పాదయాత్రకు బ్రేకులు వంటి ఘటనలతో ఇరు పార్టీల మధ్యా ఉప్పు నిప్పు మాదిరిగా పరిస్ధితి వుంది. ఈ నేపథ్యంలో శనివారం వరంగల్లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో టీఆర్ఎస్, సీఎం కేసీఆర్లపై బీజేపీ నేతలు జేపీ నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. దీనికి టీఆర్ఎస్ నేతలు ధీటుగా బదులిస్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం వరుస ట్వీట్లు చేసిన ఆయన.. మోడీ తెలంగాణకు ఏ మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదని ఆరోపించారు. 2014కు ముందు 67 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేస్తే.. గడిచిన ఎనిమిదేళ్లలో కేసీఆర్ 16 కళాశాలలు మంజూరు చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు.
ALso Read:నడ్డావన్నీ అబద్ధాలే... కిషన్ రెడ్డి నాతో వరంగల్ వస్తే అభివృద్ధి చూపిస్తా : హరీశ్ రావు సవాల్
జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని.. వీటిలో సంగారెడ్డి, మహబూబ్నగర్ కాలేజీల నిర్మాణం పూర్తి కావొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
అంతకుముందు మంత్రి హరీశ్ రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..బీజేపీవి అన్ని అబద్ధాలు, జూటా మాటలని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి తనతో వరంగల్కు వస్తే ఆసుపత్రి పనులు చూపిస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. కేంద్రం వాటా తెలంగాణలో ఒక్క పైసా కూడా లేదని.. జేపీ నడ్డా అన్ని అబద్ధాలే చెప్పారని మంత్రి ఆరోపించారు. గుజరాత్, మహారాష్ట్రలలో ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. పోరాటాల గడ్డపై నడ్డా అబద్ధాలు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.