నవంబర్లోనే ఎన్నికలు: కెటిఆర్ అంచనా
ముందస్తు ఎన్నికలేనా?
హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ మాసంలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. ఎన్నికల నాటికి హైద్రాబాద్ లో అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
మంగళవారం నాడు జిహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. నవంబర్ మాసంలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అధికారులతో చెప్పారు. ఎన్నికల నాటికి హైద్రాబాద్ లో అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రోడ్ల తవ్వకాలకు ఎందుకు అనుమతులు ఇస్తున్నారని మంత్రి కెటిఆర్ అధికారులను ప్రశ్నించారు. ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేకపోతున్నానని మంత్రి చెప్పారు. కోట్లాది రూపాయాలను ఖర్చు చేస్తున్నా ఎందుకు రోడ్ల పరిస్థితులో మార్పులు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.
పనులను సకాలంలో పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైద్రాబాద్ నగరంలో రోడ్లను ఎక్కడికక్కడే తవ్వుతున్నారు. రోడ్ల తవ్వకాలతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని మంత్రి కెటిఆర్ సమావేశంలో ప్రస్తావించారు.