జమిలి ఎన్నికల ప్రతిపాదనపై స్పందించారు మంత్రి హరీశ్ రావు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చిందన్నారు. జమిలి ఎన్నికల కమిటీలో దక్షిణాది వారికి చోటు లేకుండా చేశారని మంత్రి ఎద్దేవా చేశారు.
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై స్పందించారు మంత్రి హరీశ్ రావు. సోమవారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదిపై బీజేపీకి ఎందుకంత చిన్న చూపని మండిపడ్డారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ వివక్ష చూపుతోందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జమిలి ఎన్నికల కమిటీలో దక్షిణాది వారికి చోటు లేకుండా చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ కీలక శక్తిగా ఎదుగుతుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలపైనా మంత్రి చురకలంటించారు. కొందరు డిక్లరేషన్లు అంటూ నాటకాలకు తెరలేపారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు డిక్లరేషన్ ఇచ్చారని.. చెల్లని రూపాయికి గీతలెక్కువ అన్నట్లు, గెలవని కాంగ్రెస్కు హామీలెక్కువ అంటూ హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఛత్తీస్గఢ్ , కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుందని.. కానీ వికలాంగుల పెన్షన్ రూ.1000 మాత్రమేనని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ముగిసిపోతుందని హరీశ్ రావు హెచ్చరించారు. ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు.
ALso Read: జమిలి ఎన్నికలంటే ఏమిటీ? ఈ విధానంతో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏమున్నాయ్?
కాగా.. బీఆర్ఎస్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ సభలో ప్రసంగించిన ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. తమకు ఓటు వేసిన వారికే పథకాల్లో చోటు వుంటుందన్నారు. అయితే రెడ్యా నాయక్ ప్రసంగానికి కొందరు యువకులు అడ్డు తగిలారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపు చేశారు.
