జమిలి ఎన్నికలపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ విధానంపై చర్చ మొదలైంది. జమిలి ఎన్నికలు అంటే ఏమిటీ? ఈ విధానంతో ప్రయోజనాలు ఏమున్నాయి? ప్రతికూలతలు ఏమున్నాయి? అని బేరీజులు వేయడం ప్రారంభించారు.   

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఇంతకీ జమిలి ఎన్నికలు అంటే ఏమిటీ? ఈ విధానంతో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏమున్నాయి? రాజకీయ పార్టీల నేతలు ఏమంటున్నారు?

వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం. దీని అర్థం ఏమిటంటే.. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం. ఓటింగ్ దాదాపు ఒకేసారి జరుగుతుంది. దీన్నే జమిలి ఎన్నికలు అంటారు. 1967 వరకు ఇలా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ, ఆ తర్వాత అందులో మార్పులు వచ్చాయి. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందుగానే(1968, 1969ల్లోనే) రద్దు కాబడ్డాయి. లోక్ సభ కూడా 1970లో ముందస్తుగానే రద్దయిపోయింది. దీంతో ఉమ్మడి ఎన్నికలు చెదిరిపోయాయి.

ప్రయోజనాలు:

జమిలి ఎన్నికలతో నిర్వహణ ఖర్చును తగ్గించవచ్చు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ఎన్నికల నిర్వహణఖు ఈసీ పెట్టిన ఖర్చులు అన్నీ కలుపుకుంటే రూ. 60 వేల కోట్లు అయినట్టు ఓ రిపోర్టు తెలిపింది. జమిలి ఎన్నికలతో పాలనలో ఎఫిషియెన్సీ పెరుగుతుందని, ఎందుకంటే ఎన్నికల సమయంలో అడ్మినిస్ట్రేషన్ ఆటంకాలకు లోనవుతుంది. అధికారులు ఎన్నికల విధుల్లో చేరడంతో సాధారణ పాలనాపరమైన విధులపై ప్రభావం పడుతుంది. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగడానికి దోహదపడుతుంది. తరుచూ మోడల్ కోడ్ అమలు చేయడం వల్ల కొత్త ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం ఇబ్బందికరమవుతుంది. జమిలి ఎన్నికలు ఓటింగ్ శాతాన్ని పెంచుతాయని, ఒకేసారి ఓటు వేయడానికి ప్రజలకు అవకాశం ఉంటుందని లా కమిషన్ పేర్కొంది.

ప్రతికూలతలు:

జమిలి ఎన్నికల కోసం లోక్ సభతో అసెంబ్లీల గడువులను ఏకం చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇతర పార్లమెంటరీ కార్యకలాపాలనూ సవరించాల్సి ఉంటుంది. ఈ విధానంపై ప్రాంతీయ పార్టీలకు కొంత ఆందోళన ఉంటుంది. జాతీయ సమస్యలకు పోటీగా స్థానిక సమస్యలను లేవనెత్తడంలో ప్రాంతీయ పార్టీలకు సవాలుగా మారుతుంది. ఖర్చులు, ఎన్నికల వ్యూహాల్లోనూ జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేవు.

Also Read: జమిలి ఎన్నికలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

2015లో ఐడీఎప్‌సీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం, జమిలి ఎన్నికల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఒకే మిత్రపక్షాలను ఎన్నుకోవడానికి 77 శాతం ఓటర్లు మొగ్గుచూపుతారు. అదే ఆరు నెలల వ్యవధి తేడాతో ఈ ఎన్నికలు జరిగితే కవేలం 61 శాతం మంది ఓటర్లు మాత్రమే సేప్ పార్టీకి ఓటేస్తారని తేలింది.

జమిలి ఎన్నికలతో దేశ సమాఖ్యస్ఫూర్తికి ప్రమాదం ఉంటుందనే భయం కూడా వాటిలో ఉంటాయి.

కానీ, ఆ తర్వాత కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు అడపాదడపా వినిపించాయి. సుమారు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ జమిలి ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. కానీ, అప్పటి ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు దాని వార్షిక నివేదిక ద్వారా తెలుస్తున్నది. 1999 లా కమిషన్ కూడా ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను తెచ్చింది.

తాజాగా, బీజేపీ ఈ ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. 2014 లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే బీజేపీ ఈ నిర్ణయాన్ని పొందుపరిచినట్టు ఆ నేతలు చెబుతున్నారు. 2016లో మరోసారి ప్రధాని మోడీ దీన్ని ముందుకు తెచ్చారు. ఆ తర్వాతి ఏడాది జమిలి ఎన్నికల కోసం నీతి ఆయోగ్ ఓ వర్కింగ్ పేపర్‌ను తయారు చేసింది. 2018లో లా కమిషన్ కూడా జమిలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఐదు రాజ్యాంగ సిఫారసులు అవసరం అని పేర్కొంది.

Also Read: బీజేపీ మినీ జమిలి వ్యూహం.. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలతో అందుకే సన్నిహితం?

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ పలు పార్టీల ప్రతినిధులతో జమిలి ఎన్నికలపై సమావేశమై చర్చించారు. 2022లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర జమిలి ఎన్నికలు నిర్వహించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని, ఆ సమర్థ్యం తమకు ఉన్నదని తెలిపారు. అయితే.. ఈ విధానాన్ని అమలు చేయడానికి రాజ్యాంగ సవరణలు అవసరం అని, ఇది పార్లమెంటు చేతిలో ఉందని చెప్పారు. 2022 డిసెంబర్‌లో లా కమిషన్ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై అన్ని జాతీయ రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్, ఉద్యోగులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకుంది.

జమిలి ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటరీ రూపం నుంచి అధ్యక్ష వ్యవస్థగా మార్చాలని బీజేపీ చేస్తున్నదని ఆప్ ఈ ఏడాది జనవరిలో ఆరోపించింది. రాష్ట్రాల ఎన్నికలు ఓడిపోతామనే భయం బీజేపీకి పట్టుకుందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకధోరణితో ప్రభుత్వం జమిలి ఎన్నికల పై ముందుకు వెళ్లితే తాము నిరససిస్తామని శివసేన యూబీటీ ప్రియాంక చతుర్వేది స్పష్టం చేశారు. వీటితో పాటు ఆర్జేడీ, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీ కూడా జమిలి నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.