ఇంట్లోకి వచ్చిన పెద్ద కోతి.. షాక్ తో గుండెపోటుతో వ్యక్తి మృతి
KARIMNAGAR: మృతుని రాజు భార్య తెల్లవారుజామున నిద్రలేచి తమ ఇంటి బయట ఉన్న కుళాయిలోంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్లివచ్చి.. తలుపులు వేయడం మరిచిపోయింది. కాసేపటికి ఓ పెద్ద కోతి ఇంట్లోకి వచ్చింది.
కరీంనగర్: ఇంట్లోకి పెద్ద కోతి వచ్చింది. దానిని చూసిన ఓ మహిళ కేకలు వేస్తూ.. తన భర్తను పిలిచింది. అయితే, ఆయన ఒక్కసారిగి పెద్ద కోతిని చూసి షాక్ కు గురయ్యాడు. కోతిని చూసిన షాక్ లో హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని కరీంనగర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. బుధవారం తెల్లవారుజామున తన ఎదురుగా ఉన్న కోతిని చూసి 45 ఏళ్ల వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఇక్కడ మంచం మీద నుండి లేచినవెంటనే అతనికి కోతి కనిపించడంతో షాక్ గురై cardiac arrest తో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రుద్రోజు రాజు హనుమాన్ నగర్లో నివాసం ఉంటుండగా ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు భార్య తెల్లవారుజామున నిద్రలేచి తమ ఇంటి బయట ఉన్న కుళాయిలోంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్లింది. ఈ క్రమంలోనే మళ్లీ ఆమె తలుపులు వేయడం మరిచిపోయింది. కాసేపటికి ఓ పెద్ద కోతి ఇంట్లోకి ప్రవేశించింది. రాజు, అతని ఇద్దరు పిల్లలు తమ బెడ్ పై నిద్రిస్తున్నారు.
కోతిని చూసి మొదట షాక్కు గురైన రాజు భార్య కేకలు వేయడం ప్రారంభించింది. మెలకువ వచ్చిన రాజుకు ఒక్కసారిగా తన కళ్ల ముందే పెద్ద కోతి కనిపించడంతో షాక్ అయ్యాడు. ఈ క్రమంలోనే హఠాత్తుగా గుండె ఆగిపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రుద్రోజు రాజు భార్య ఏడుస్తూ.. తమ ఇంటిపక్కన ఉన్న పొరుగువారిని సాయం కోసం పిలిచింది. స్థానికులు ఇంటికి చేరుకుని కొతిని అక్కడి నుంచి తరమేశారు. అసస్మారకస్థితిలో ఉన్నరుద్రోజు రాజును ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాజు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
కాగా, ఈ ప్రాంతం కొంతకాలంగా కోతుల బెడదతో పోరాడుతోంది. కోతులు ఇండ్లల్లోకి రావడం, దీని ఫలితంగా నీటి పైపులు దెబ్బతినడం, ఇంటి నర్సరీలను ధ్వంసం చేయడం, ఇళ్లలోకి కోతులు ప్రవేశించడం, పిల్లలు-వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో చిన్నారులు, పెద్దలపై కోతులు దాడిచేసిన ఘటనలు నమోదయ్యాయి. కోతుల నుంచి తమను రక్షించాలని స్థానికులు అనేక ఫిర్యాదులు అధికార యంత్రాంగానికి సమర్పించారు. ఈ క్రమంలోనే చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. కోతులను పట్టుకోవడానికి రూ.10 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు దాదాపు 1,000 కోతులను పట్టుకుని అడవుల్లోకి వదిలారు. అయినప్పటికీ కరీంనగర్ నగరంలో కోతుల బెడద అంతకంతకూ కొనసాగుతోంది. కోతులతో ప్రజా ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి.
కాగా, ఈ ఏడాదిలో జూన్ లో కోతుల బెడద నుంచి పట్టణ వాసులకు ఊరట కల్పించేందుకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల కౌన్సిల్ తీర్మానం ఆధారంగా కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లలో కోతులను పట్టుకునేందుకు రూ.10 లక్షలతో కోతులు పట్టే వారితో ఎంసీకే ఒప్పందం చేసుకుంది. 33వ డివిజన్లోని భగత్నగర్లో మొత్తం 150 కోతులను పట్టుకున్నారు. 33వ డివిజన్లో పట్టుకున్న కోతులను కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి పరిశీలించిన అనంతరం.. కోతులను అటవీ ప్రాంతంలో వదలాలని కోతులు పట్టేవారిని మేయర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సునీల్రావు మాట్లాడుతూ.. అన్ని డివిజన్ల నుంచి కోతుల బెడదపై ఫిర్యాదుల మేరకు ఎంసీకే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కోతులను పట్టుకుని ప్రజలకు కోతుల బెడద నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు.