హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. రాష్ట్రంలో మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 13న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్లు మూసేయాలని, ఈ సమయంలో మద్యం విక్రయించరాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జారీ చేసిన నిబంధనలను అతిక్రమించిన వైన్స్లపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఏపీలో మందుబాబులకు కూడా షాకింగ్ న్యూస్. ఈ నెల 13న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు లిక్కర్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు.. అంటే, ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు,స్టార్ హోటళ్లు,నేవల్ క్యాంటీన్స్, టూరిజం బార్స్, మద్యం డిపోలు, కల్లు దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు. అలాగే 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఆ రోజు కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను వేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే..టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో 9 నియోజకవర్గాల్లో 5 అధికార వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 3 పట్టభద్రులు,2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 16న వెలువడనున్నాయి.
