నిజమే... ఐటీ కంపేనీల్లో డ్రగ్స్ వాడుతున్నారన్న తెలంగాణ ప్రభుత్వం
- హైదరాబాద్ ఐటీలో డ్రగ్స్ వాడుతునట్లు నిర్దారణ.
- దృవీకరించిన ఐటీ శాఖ అధికారి.
- తక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి.
డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మాత్రమే కాదు తెలంగాణలో ఉన్న పలు రంగాలను కూడా పాకింది. ఇప్పటి వరకు కేవలం సినిమా రంగానికి, స్కూళ్లకు మాత్రమే అని భావించిన, ఇప్పుడు హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు ఆబ్కారీ శాఖ దృష్టికి వచ్చింది. గత వారం రోజుల నుండి నగరంలో అన్ని ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ గురించి మరింత సమాచారం సేకరించారు. ఎక్సైజ్ శాఖ నుండి ఐటీ శాఖ కు సమాచారాన్ని పంపించారు.
అయితే ఈ విషయం పై తెలంగాణ ఐటీ కార్యదర్శీ జయేష్ రంజన్ మాట్లాడారు. నగరంలో ఏ ఐటీ కంపెనీల ఉద్యోగులు డ్రగ్స్ వాడుతున్నారో సిట్ అధికారులు లిస్ట్ ఇచ్చారని, డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లను మాత్రం ఇవ్వలేదని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కంపెనీల పేర్లను వెల్లడించలేమని, ఈ విషయం పై ఆయా కంపెనీలను అప్రమత్తం చేశామని, వారితో మాట్లాడుతున్నామని ఆయన తెలిపారు.
ఈ డ్రగ్స్ వాడుతున్న ఐటీ కంపేనీల ప్రతినిధులను పిలిపించామని, డ్రగ్స్ నియంత్రణ విషయంలో కంపెనీలు కచ్చితంగా నియమాలు పాటించాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పామని అన్నారు. హైదరాబాద్ లో 400 కంపెనీలు, 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, మొత్తం ఐటీ రంగమంతా డ్రగ్స్ తీసుకుంటుందన్న ప్రచారం కరెక్ట్ కాదని జయేష్ రంజన్ అన్నారు. నగరంలో ఐటి సెక్టార్లో డగ్స్ సరఫరా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, కఠిన నిర్ణయాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు.