హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ హోంమంత్రి మొహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ స్పందించారు. తాను ఎవ్వరికీ పార్టీ ఇవ్వలేదని.. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. ఘటన జరిగిన రోజున తాను మినిస్టర్స్ క్వార్టర్స్లో వున్నానని ఆయన తెలిపారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తోంది. పలువురు ప్రజా ప్రతినిధులు పిల్లల ప్రమేయం ఇందులో వున్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో వివాదాస్పదమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ హోంమంత్రి మొహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ స్పందించారు. అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని.. ఘటన జరిగిన రోజున తాను మినిస్టర్స్ క్వార్టర్స్లో వున్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఎవ్వరికీ పార్టీ ఇవ్వలేదని.. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు చేసిన వారు నిజానిజాలు తెలుసుకోవాలంటూ పుర్ఖాన్ అన్నారు.
మరోవైపు.. హైదరాబాద్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసుపై (amnesia pub rape case) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్గా స్పందించింది. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని.. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో బాలిక రేప్ కేసులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ (waqf board chairman) కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారులోని ఓ ప్రాంతంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారుడితో పాటు మరో మైనర్ బాలుడు వున్నాడు. హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని.. డీజీపీ, సీపీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read:amnesia pub rape case : తెలంగాణ సర్కార్ సీరియస్.. పోలీసుల అదుపులో వక్ఫ్బోర్డ్ ఛైర్మన్ కుమారుడు
అంతకుముందు అత్యాచార కేసుకు సంబంధించి బీజేపీ (bjp) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి మనవడు, పీఏ పాత్రపై నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడే సూత్రధారంటూ రఘునందన్ రావు ఆరోపించారు. పబ్లో పార్టీ బుక్ చేసిందే హోంమంత్రి (home minister mahmood ali ) మనవడని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ (mim) ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు, పాతబస్తీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు , హోంమంత్రి మనవడు , హోంమంత్రి పీఏ హరిలు సీసీటీవీ ఫుటేజ్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారని రఘునందన్ రావు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రేప్ కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇదంతా హిందూ అమ్మాయిలపై రజాకార్ల వారసత్వ మనస్తత్వం కలిగిన ఎంఐఎం పార్టీ పెద్దలు కొందరు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కొందరు కలిసి జరుపుతున్న దాడిగా బీజేపీ ఆరోపిస్తోందని రఘునందన్ రావు అన్నారు. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి వుంటే .. హోంమంత్రిని ఆ పదవి నుంచి తొలగించి నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవిలో మహమూద్ అలీ వుంటే దర్యాప్తు పారదర్శకంగా జరగదని రఘునందన్ రావు ఆరోపించారు.
హైదరాబాద్ ఆమ్నేషియా పబ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షల నిమిత్తం మైనర్ బాలికను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నలుగురు నిందితులపై పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను పబ్కు తీసుకెళ్లిన హడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాడిని బురిడి కొట్టించి బాలికను సదరు బాలురు తీసుకెళ్లారు. రెండు గంటల పాటు బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అత్యాచారం చేసి మరో కారులో బాలికను పబ్ వద్ద వదిలిపెట్టారు. పబ్, బేకరీతో పాటు పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
