గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవానికి బ్రేక్ పడింది.  


హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై యథాతథస్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రభుత్వ సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లు నిన్ననే ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ మండలి చైర్మెన్ అందుబాటులో లేని కారణంగా ఈ కార్యక్రమం జరగలేదు. ఇవాళ వీరిద్దరూ ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ తరుణంలో హైకోర్టు నిర్ణయం వెలువడింది. దీంతో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ల ప్రమాణానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రమాణం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ పదవులకు సిఫారసు చేసింది. అయితే వీరిద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ సాగుతుంది. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

also read:గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు: కోదండరామ్, అమరుల్లాఖన్ లను నియమించిన గవర్నర్

దరిమిలా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ల పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది. ఈ నెల 25న సిఫారసులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.