హైద్రాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీపై  సులోచన అగర్వాల్  తెలంగాణ  హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.ఈ విషయమై  విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. నగరంలోని సర్వే నంబర్ 38/8, 38/9లో గల భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేయాలని తమను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బెదిరింపులకు దిగాడని సులోచన అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు.ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మనుషులు తమ ఫ్యాక్టరీలో దోపిడీ చేసినా పోలీస్ అధికారులు స్పందించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇరవై కోట్ల రూపాయల మెషిన్లను అల్యూమినియం బండెల్‌లను పోలీసుల సాయంతో గాంధీ దోపిడీ చేశారని ఆ పిటిషన్‌లో ఆమె తెలిపారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, ఎస్‌ఐ మల్లేశ్వర్‌లను ఆదేశించింది. అంతేకాదు నివేదికను కూడ సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే గాంధీకి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలంటూ పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.