ప్రపంచమంతా హైదరాబాద్ వైపే చూస్తోందట
- ప్రయివేటు దావఖానాలు పేదలకు సాయం చేయాలి
- కార్పొరేట్ ఆసుపత్రులు సర్కారుకు సహకరించాలి
నేడు ప్రపంచం దృష్టి హైదరాబాద్ మీద పడిందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు సమీపంలోని మా ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించారాయన. ప్రభుత్వ వైద్య సేవలతోపాటు ప్రైవేట్ సేవలు కూడా ప్రజలకు అవసరమే అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ సేవా నిరతితో పని చేయాలన్నారు. కేవలం వ్యాపారమే లక్ష్యంగా కాకుండా నిరుపేదలకు సాయం చేయాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఇఎన్టీ విభాగంలో ఇంకా అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే అనేక ఆధునిక పరికరాలు అందించి, మంచి వైద్యం ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు.
హైదరాబాద్ హెల్త్ హబ్గా మారింది వైద్యం విషయంలో ప్రపంచం దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీద ఉందని.. ఇందుకు సీఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలు, వైద్యారోగ్యంపై పెడుతున్న శ్రద్ధే కారణమన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. అందుకు ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సహకరించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, నియమాలు, పద్ధతులకు తగ్గట్లుగా పని చేయాలని సూచించారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్, టిఆర్ఎస్ ఖైతరాబాద్ ఇన్చార్జీ మన్నె గోవర్దనరెడ్డి, డాక్టర్ కె.ఆర్.మేఘనాథ్, సూజాత, సునీత, డాక్టర్ రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.