చేనేత పైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణలోని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్నలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో పోస్ట్ చేశారు.
చేనేత పైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణలోని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్నలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో పోస్ట్ చేశారు. చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి అబిడ్స్ పోస్టాఫీస్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడురి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు పాల్గొన్నారు.
అంతకుముందు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన వేదిక వద్ద లక్షలాది ఉత్తరాలను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. నేతన్నల సంక్షేమానికి గతంలో ఉన్న జీవిత బీమా, యార్న్ సబ్సిడీ వంటి కార్యక్రమాలను పునరుద్ధరించాలని కోరారు. రద్దు పరిచిన హ్యాండ్లూమ్, పవర్ లూమ్ వంటి బోర్డులను వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. వారికి ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి, వారిని చేనేత వృత్తి నుంచి దూరం చేస్తుందని ఆరోపించారు. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం అత్యంత కీలకమైన ఆయుధంగా వాడిన చేనేత ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ విధించడం అత్యంత దారుణం అన్నారు. పైగా ఐదు శాతం ఉన్న జీఎస్టీ ని చేనేత వస్త్రాలపై 12 శాతానికి పెంచేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. అయితే దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల వలన ప్రస్తుతం దాన్ని ఆపి ఉంచిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేనేతపైన ఉన్న ఐదు శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలనే డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి రాశారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం చేనేతపైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీని రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
రాపోల్ ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ.. లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధాని మోదీ పంపించడం ద్వారా చేనేత కార్మికులు తమ దుఃఖాన్ని, బాధను తెలియజేసేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇప్పటికైనా మోదీ వెంటనే స్పందించి చేనేతపైన జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
