ఇంకా ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
జూన్ 2 నాటికి అయిదున్నర లక్షల మంది తెలంగాణా నిరుద్యోగులు గ్రూప్ 2 పరీక్షరాసి 200 రోజులవుతుంది. రాష్ట్రమొస్తే ఉద్యోగమొస్తుందని, బతుకు గట్టెక్కుతుందనుకున్న అనుకున్న లక్షాలది మంది యువకులు ఊరెళ్లలేక, హైదరాబాద్ లో ఉండలేక, టిఎస్ పిఎస్ సి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇంటర్వ్యూ లు పూర్తయి, పోస్టింగ్ వచ్చేసరికి ఎన్ని నెలల పడుతుందో. అందుకే ఈ నిరాశ ద్విశతదినోత్సవం జరుపుకోవాలని తెలంగాణా యువకులు చూస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగమొస్తుంది, జీవితం గట్టెక్కుతుందని ఆశించి గ్రూప్ 2 పరీక్ష రాసిన తెలంగాణా యువకుల నిరాశ 200 రోజులకు చేరుకుంది.
గ్రూప్ 2 పరీక్ష ఎపుడో నవంబర్ 11,12 14 తేదీలలో రాశారు. తప్పులో ఒప్పులో రెండు సార్లు కీ రిలీజ్ చేశారు. ఇక ఫలితాలు రావాలి. ఎపుడొస్తాయో తెలియదు. జూన్ 2 తేదీ నాటికి పరీక్ష రాసి రెండు వందల రోజులు పూర్తవుతుంది.నిరాశ ద్విశతదినోత్సవ జరుపుకునేందుకు గ్రూజ్ టు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బయట సాధ్యంకాదు కాబట్టి ఫేస్ బుక్ లో, వాట్సాప్ లలో నయినా ఈ నిరసనను వ్యక్తం చేయాలని కొన్ని మంది పూనుకుంటున్నారు.
200 రోజులుగా, ఊరికిపోలేక, హైదరాబాద్ లో ఉండలేక, అష్టకష్టాలు పడి, మార్కెట్ లోకి వచ్చిన ప్రతి జనరల్ నాలెడ్జ్ పుస్తకం కొని చదవుతూ, కరి పాయంట్లలో దొరికొంది కొని తింటూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
గ్రూప్ 2 రిక్రూట్ మెంట్ ప్రాసెస్...ఒక బాధకరమయిన సుదీర్ఘ యాత్ర. మొదట 2015 డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చింది. 2016 ఏప్రిల్ లో పరీక్షలన్నారు. నోటిఫికేషన్ లో చూపిన ఉద్యోగాలు తక్కువగా ఉండటం, సిలబస్ మార్చడంతో ఎక్కువ ఖాళీలు కావాలని నిరుద్యోగులు కోరారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి 2016 జూన్ లో మరొక నోటిఫికేషన్ తెచ్చారు. అపుడు వేయ్యికి పైగా పోస్టులు తేలాయి. 2016 నవంబర్ లో పరీక్షలు రాసింది వీటి కోసమే. అంటే పరీక్షలు ఏడు నెలలు వాయిదా పడ్డాయన్నమాట. సుమారు 5 లక్షల మంది దాక ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలను టిఎస్ పిఎస్ సి చాలా లోపాలతో నడిపింది. ప్రశ్నల తప్పులు, విద్యార్థుల తప్పులు. కోర్టు కేసులు. పరీక్షలపుడు మహిళా అభ్యర్థుల మంగళ సూత్రాలు కూడా తీసేయించారు.
ఏమయితే ఏముంది,ఒక పరీక్ష నిర్వహించి ఉద్యోగాలివ్వడానికి దాదాపు రెండేళ్లు పడేటట్లు ఉంది. ఎందుకంటే ఇపుడు ఫలితాలు వచ్చాక, దాదాపు రెండు వేల మందిని ఇంటర్వ్యూకి పలిచి, వారికి పోస్టింగులిచ్చే సరికి ఎన్ని రోజులు పడుతుందో?
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మూడు ముక్కల నినాదంతో దావానలమయింది. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఆ మూడు ముక్కలు. అయితే, నిధులు అంత ఈజీగా సమకూరేవి కావు, నీళ్ల ఉన్నఫలానా వూరేవికాదు. ఇక తెలంగాణా ప్రభుత్వం చేతిలో కచ్చితంగా ఉండేవి, అనుకుంటే అందించగలిగేవీ ప్రభుత్వ ఉద్యోగాలే. తెలంగాణా రాష్టం ఏమి తెస్తుందో ఎవరికి ఎరికేం లేదు, లక్షలాది యువకులు మాత్రం ఉద్యోగాలొస్తాయనుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా లక్ష ఉద్యోగాలనిచెప్పింది. అంతా తెలంగాణా పబ్లిక్ సర్వీస్ ఆపద్భాందవి లాగా చూశారు. డిగ్రీ చదవిని ప్రతి తెలంగాణా పోరగాడు గ్రూప్ వన్ , గ్రూప్ టు వైపు ఆశగా చేశారు. నోటిఫికేషన్ ఇచ్చే ముందు మూడునెలల్లో పరీక్షలు నిర్వహిస్తామని టిఎస్ పిఎస్ సి ఛెయిర్మన్ ప్రకటించారు.
ఏమయితే ఏముంది, తెలంగాణా గ్రూప్ 2 అభ్యర్థుల నిరాశకు విజయవంతంగా రెండు వందల రోజులు పూర్తవుతాయి.