భారీ వర్షాల నేపథ్యంలో  రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 

గడిచిన రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించాలని కార్మిక శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలు వున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హెలికాఫ్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా వుంచాలని కేసీఆర్ సూచించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ALso Read: తెలంగాణలో భారీ వర్షాలు:జఫర్ ఘడ్ లో 19.2 సెం.మీ. వర్షపాతం, ఈ నెల 24 వరకు వానలు

మరోవైపు.. హైదరాబాద్‌ నగరంలోనూ కుంభవృష్టి కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని .. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ మోహరించింది. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో వుంటారని తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ టీమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొంది. నాలా పనులు పూర్తి కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. శిథిలావస్థలో వున్న భవనాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది.