తెలంగాణ ఉద్యోగులను రప్పించేందుకు చర్యలు: ఏపీకి తెలంగాణ సర్కార్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను రాష్ట్రానికి పంపించాలని ఏపీ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను రాష్ట్రానికి పంపించాలని ఏపీ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు రప్పించేందుకు చర్యలు తీసుకొంటామని సీఎం హమీ ఇచ్చారు.
ఈ హమీలో భాగంగా తెలంగాణ అధికారులు మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన సుమారు 698 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో వీరంతా తెలంగాణకు ఆఫ్షన్ ఇచ్చినా కూడ ఏపీ రాష్ట్రానికి అలాటయ్యారు. దీంతో వీరంతా అనివార్యంగా ఏపీ రాష్ట్రంలో పనిచేస్తున్నారు.
వీరిని తెలంగాణకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.విద్యుత్ ఉద్యోగుల సమస్య ఇటీవలనే పరిష్కారమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై కోర్టు కూడ విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమిటీకి కీలక సూచనలు చేసింది.